గద్వాల, ఏప్రిల్ 5 : కులగణన సర్వే చేసి ఏడాది దాటినా ఎన్యూమరేటర్లకు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు పారితోషికం ఇవ్వక పోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. వారు పనిచేసి ఏడాది గడిచినా చేసిన పనికి డబ్బులు రాకపోవడంతో కంప్యూటర్ ఆపరేటర్లు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు ఆపరేటర్లు విన్నవించుకోగా ఏడాది తర్వాత ప్రభుత్వం డాటా ఎంట్రీ ఆపరేటర్లకు నిధులు విడుదల చేసింది.
అయితే నిధులు విడుదల విషయం ఎంపీడీవోలు డాటా ఎంట్రీ ఆపరేట్లకు తెలియకుండా దాచి ఉంచి నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే గతేడాది ప్రభుత్వం ఎన్యూమరేటర్ల ద్వారా గ్రామాలతోపాటు మున్సిపాలిటీలో కులగణన సర్వే చేపట్టింది. అయితే ఎన్యూమరేటర్లు గ్రామాల్లో కులగణన సర్వే చేసిన తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేయడానికి ఎంపీడీవోలతోపాటు ఉపాధ్యాయులు డాటా ఎంట్రీ ఆపరేటర్లు నియమించి ఎన్యూమరేటర్లు చేసిన కులగణను సర్వేను డాటా ఎంట్రీ ఆపరేటర్ల సాయంతో ఆన్లైన్ నమోదు చేశారు. ఒక్కో దరఖాస్తు ఫారం ఆన్లైన్లో నమోదు చేయడానికి డాటా ఎంట్రీ ఆపరేటర్కు రూ.30 చెల్లించాల్సి ఉంది.
జిల్లాలోని 13మండలాల్లో రెండు మండలాల్లో మాత్రమే ఎంపీడీవోలు డాటా ఎంట్రీ ఆపరేటర్లు నియమించుకొని దరఖాస్తులు ఆన్లైన్ చేయగా మిగతా మండలాల్లో ఎన్యూమరేటర్లు కొందరు చేశారు. కంప్యూటర్లో నమోదు చేయలేని వారు డాటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా చేయించారు. అయితే డాటా ఎంట్రీ ఆపరేటర్లు కులగణన సర్వే దరఖాస్తులను ఆన్లైన్ నమోదు చేసి ఏడాది కావస్తున్నా ప్రభుత్వం వారికి పారితోషికం మంజూరు చేయలేదు. అయితే గతనెల 30వ తేదీన ప్రభుత్వం కులగణన సర్వే దరఖాస్తులు (డాటాఎంట్రీ)ఆన్లైన్లో నమోదు చేసిన వారికి రూ.48,44,250 నిధులు మంజూరు చేసింది.
అయితే ఈవిషయం ఎంపీడీవోలు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తుంది. జిల్లాలో 13మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో 1,76,061 మంది హౌస్హోల్డర్లను ఆపరేటర్లు డాటా ఎంట్రీ చేశారు. వీరికి ఒక్కో దరఖాస్తు ఫారాన్ని డాటా ఎంట్రీ చేయడానికి రూ.30 చొప్పున పారితోషికం చెల్లించాల్సి ఉంది. అలా జిల్లా మొత్తం రూ.48,44,250 డాటా ఎంట్రీ ఆపరేటర్లు చెల్లించడానికి ప్రభుత్వం సీపీవోకు నిధులు విడుదల చేసింది. అయితే డాటా ఎంట్రీ చేసే సమయంలో ఎన్యూమరేటర్లు కంప్యూటర్ ఆపరేటర్ల ఖాతా నెంబర్లు ఇచ్చిన అధికారులు వారి ఖాతాలో నగదు జమచేయకుండా ఎంపీడీవో ఖాతాల్లో జమచేశారు. ఎంపీడీవో ఖాతాల్లో నగదు జమ చేసి ఐదురోజులు దాటినా ఆ విషయం బయటక పొక్కకుండా ఎంపీడీవోలు గోప్యంగా ఉంచుతున్నారు.
అయితే కొంతమంది ఎన్యూమరేటర్లు నిధులు విడుదలైన విషయం ఎంపీడీవోలను అడుగగా వారు దాట వేసే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధులు ఎందుకు ఎంపీడీవోల ఖాతాల్లో జమచేశారో ఎవరికి అర్థం కావడం లేదు. కుల గణన సర్వే చేసిన ఎన్యూమరేటర్లకు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు పారితోషికం చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో అలంపూర్ ఎంపీడీవోకు శనివారం వినతిపత్రం అందజేశారు. కుల గణన సర్వే చేసి ఏడాది దాటినా ఇంతవరకు పారితోషికం చెల్లించడం లేదన్నారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని పారితోషికం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎన్యూమరేటర్లతో పాటు డాటా ఎంట్రీ ఆపరేటర్లు కోరుతున్నారు.