మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం కొత్లాబాద్ గ్రామ శివారులో శనివారం రాత్రి చిరుత పులి దాడిలో గాయపడి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ముగ్గురిని ఆదివారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పరామర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను కలెక్టర్ ఆదేశించారు.
గొర్రెల కాపరి గొల్ల మైబన్న గ్రామానికి సమీపంలో శనివారం రాత్రి తన గొర్రెల మందను నిలిపి నిద్రించాడు.
అర్ధ రాత్రి మందలో అలజడి కని పించడంతో గొర్రెల కాపరి పక్కనే ఉన్న రైతులు సత్యనారాయణ రెడ్డి, చెన్నారెడ్డి లను పిలిచాడు. అందరూ కలిసి బ్యాటరీ సహాయంతో మందలో పరిశీలించగా చిరుత పులి అప్పటికే నాలుగు గొర్రెలను చంపి వాటి రక్తాన్ని తాగి నిద్రిస్తుంది. ఈ ముగ్గురి మాటలకు చిరుత లేచి వారిపై దాడికి పాల్పడింది. ముగ్గురి కేకలతో గొర్ల అలజడికి చిరుత వెనక్కి తగ్గి గుట్టలోకి వెళ్లిపోయింది. గాయపడ్డ వారిని కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు. ఇప్పటికే చిరుత సంచరించే ప్రదేశంలో అటవీ అధికారులు బోనును ఏర్పాటు చేసి కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.