సజావుగా మొదటి ‘ప్రజావాణి’
మహబూబ్నగర్, డిసెంబర్ 12 : మహబూబ్నగర్లోని కొత్త కలెక్టరేట్లో నూతనోత్సాహంతో పనిచేద్దామని కలెక్టర్ వెంకట్రావు అధికారులకు పిలుపునిచ్చారు. సోమవారం నూత న కలెక్టరేట్లో నిర్వహించిన తొలి ప్రజావాణికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కలెక్టర్ నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ‘మా కుటుంబంలో ఒకరికి పూర్తిగా వైకల్యం ఉంది.. వీల్చైర్ కావాలి’ అని కలెక్టర్కు తొలి ఫిర్యాదు అందింది. వెంటనే ఇందుకు కలెక్టర్ వెంటనే స్పందించారు.
డీడబ్ల్యూవో జరీనాబేగంను పిలిచి వీల్చైర్ ఇవ్వాలని ఆదేశించారు. మొదటి ఫిర్యాదు వందశాతం పరిష్కరించార ని అధికారులు చర్చించుకుంటున్నారు. ఫిర్యాదుల స్వీకరణ ముందు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనే తపనతో అధికారులు పనిచేయాలని సూచించారు. త్వరలోనే అధికారులకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానంతో నూతన భవనాన్ని నిర్మించిందన్నారు.
ఫిర్యాదుదారుల సమస్యలను పూర్తిగా తెలుసుకొని పరిష్కరించాలన్నారు. సమస్య పరిష్కరించే వీలు లేకుంటే.. స్పష్టంగా వివరించాలన్నారు. ఫిర్యాదు కాగితంపైనే రాసి ఇస్తేనే.. సదరు వినతి పునరావృతం కాకుండా ఉంటుందన్నారు. కచ్చితమైన విధానంతో ముందుకు సాగాలని సూచించారు. కాగా, నూతన కలెక్టరేట్లో ఫిర్యాదుదారులు కూర్చునేందుకు విశాలమైన గది ఏర్పాటు చేశారు. ఎక్కడా సమస్యలు లేకుండా మొదటిరోజు సజావుగా సాగింది.
వెంటనే సమస్య పరిష్కారమైంది..
మా పిన్ని కూతురు ప్రవళిక. ఆమె కు పూర్తిగా కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో నడవలేదు. వీల్చైర్ కావాలని కలెక్టర్కు కొత్త కలెక్టరేట్లో మొదటి ఫిర్యాదు ఇచ్చాను. వీల్చైర్ సమకూర్చాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇంత త్వరగా సమస్య పరిష్కారమైతదనుకోలేదు. చాలా సంతోషంగా ఉన్నది. కొత్త కలెక్టరేట్లో ఫిర్యాదుదారులు కూర్చునేందుకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి.
– శైలజ, తీగలపల్లి, నవాబ్పేట మండలం