వనపర్తి, ఫిబ్రవరి 17: జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తేజస్నందలాల్ పవా ర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమీకృత భవనంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తప్పులు లేకుండా సిద్ధంచేసిన ఓటరు జాబితా, ఓటరు అవగాహన, పోలింగ్ స్టేషన్ల పేర్ల మార్పు వంటి అంశాలపై తీసుకున్న చర్యలను రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించారు.
తుది ఓటరు జాబితా వచ్చినప్పటికీ డబుల్ ఓటర్లు, మరణించిన వారి పేర్లు తొలగించడం వంటి వాటిపై దృష్టి సారించామన్నారు. పొలిటికల్ పార్టీ ప్రతినిధుల దృష్టిలో ఇంకా ఏమైనా అంశాలు, ఫిర్యాదులు ఉంటే తెలియజేయాలని సూ చించారు. ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాల్లో ఎలాంటి సందేహాలు, ఫిర్యాదులు లేవని రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటరు జాబితా మున్సిపాలిటీ, మండలాల వారీగా వేరు చేసి ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. ఇందుకు కలెక్టర్ వెంటనే అధికారులను ఆదేశించారు.
సమస్య తలెత్తిన ఈవీఎంలు 28 బ్యాలెట్లు, ఒక కంట్రోల్, 12వీవీప్యాట్ యూనిట్లను శనివారం వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రత్యేక వాహనంలో పోలీసు భద్రతతో హైదరాబాద్లోని ఈసీఐఎల్ కంపెనీకి తరలించామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్గంగ్వార్, ఆర్డీవో పద్మావతి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సయ్యద్ జమీల్, రహీమ్, శంకర్, ప్రవీణ్, వేణాచారి, వంశీకృష్ణ పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులున్న డీటీసీపీ ఆమోదిత లేఅవుట్ ప్లాట్లనే ప్రజలు కొనుగోలు చేయాలని కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి లేఅవుట్ కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో టీఎస్బీపాస్ ద్వారా మొత్తం 11 దరఖాస్తులు వచ్చాయని, వాటిని కమిటీ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు. వాటిలో కేవలం 2 మాత్రమే నిబంధనలకు లోబడి ఉన్నందును ఆమోదించినట్లు తెలిపారు. మిగతా 9 లేఅవుట్ నిబంధనల అనుసారం లేవని కమిటీ ద్వారా తిరస్కరించినట్లు తెలిపారు.
ఆర్అండ్బీ, పీఆర్, ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీలో నిబంధనల ప్రకారం ఎలాంటి సౌకర్యాలు లే అవుట్లో ఉన్నాయో పరిశీలించినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం అంతర్గత రోడ్లు, గ్రీనరీ, అవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ హెడ్ ట్యాంకులు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, డ్రైన్, సెప్టిక్ ట్యాంక్, మాస్టర్ ప్లాన్ అప్రోచ్ రోడ్డు తదితర మొత్తం 18 రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నయో లేదో పరిశీలించి రెండింటికి మాత్రమే కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, నగేశ్, ఆయా శాక అధికారులు తదితరులు పాల్గొన్నారు.