నారాయణపేట టౌన్, మార్చి 18: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా స్థాయి రోడ్డు భద్రత సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు తమవంతు బాధ్యతలు నిర్వర్తించి, చేపట్టిన పనుల నివేదికను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. 2014 నుంచి 2022వరకు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదాలతో 650మంది ప్రాణాలు కోల్పోయారని, 1,205 మంది క్షతగాత్రులైనట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉందని, వాటిని వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్, రోడ్డు భవనాలు, జాతీయ రహదారులు, మున్సిపల్ తదితర శాఖల అధికారులు రోడ్లను పర్యవేక్షించి, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, ఇరుకైన వంతెనల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.రోడ్లపై గుంతలను వెంటనే పూడ్చి వేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో రోడ్లపై ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను తొలగించాలన్నారు.
ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జిల్లాలోని జాతీయ రహదారి, రాష్ట్ర రహదారులు, ఆర్ఆండ్బీ రహదారులపై ప్రమాదాలు జరుగకుండా పోలీస్శాఖ ఆధ్వర్యంలో కళాబృందాలు, షీ టీమ్స్తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధికవేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించడం జరుగుతుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదవశాత్తు రోడ్డుప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు మహబూబ్నగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లగా.. అప్పటికే ఆలస్యం కావడంతో క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికల్లో గుర్తించినట్లు చెప్పారు. సమావేశంలో డీఎంహెచ్వో రాంమనోహర్రావు, ఆర్అండ్బీ ఈఈ కేవీఎన్ స్వామి, డీఈ రాములు, డీఎస్పీ సత్యనారాయణ, పీఆర్ ఈఈ నరేందర్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.