నారాయణపేట టౌన్, జనవరి 7 : జిల్లాలో ఇంజినీరింగ్ శాఖ నుంచి చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. అంగన్వాడీ భవనాలు, పాఠశాల అదనపు గదుల నిర్మాణాలు, కాన్కుర్తిలో లైబ్రరీ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల నిర్మాణ పనులకు నిధుల కొరత లేదని, స్థలం విషయంలో ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
జిల్లాలో మోడల్ పాఠశాలలుగా తీర్చదిద్దుతున్న 22 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణ పనులను సర్పంచులు, పాఠశాల కమిటీ చైర్మన్లపై ఒత్తిడి తెచ్చి రానున్న 20 రోజుల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకొచ్చి కంసాన్పల్లి, ధన్వాడ, కిష్టాపూర్-గోటూర్, నల్లగుంట్ల తండా, అంత్వార్ గ్రామాల బీటీ రోడ్డు పనులను పూర్తి చేయాలన్నారు. మన ఊరు – మన బడి పనులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో పీఆర్ ఈఈ నరేందర్, సీపీవో గోవిందరాజులు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.