కలెక్టర్ హరిచందన
ధన్వాడ,జూన్ 8: బరువు తక్కువున్న పిల్లలను గుర్తించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. బుధవారం ధన్వాడతోపాటుగా మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానిక అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల గురించి అంగన్వాడీ టీచర్లను అడిగితెలుసుకున్నారు. బరువు తక్కువ పిల్లలను గుర్తించి ప్రత్యేకంగా చికిత్స అందించాలని కోరారు. గ్రామంలో ప్రతిఇంటికీ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. తడిపొడి చెత్తతో కృత్రిమ ఎరువులను తయారుచేసి విక్రయిస్తే పంచాయతీకి ఆదాయం చేకూరుతుందన్నారు. ధన్వాడ- కిష్టాపూర్ మధ్యలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను పరిశీలించారు. బిల్లులు సమయానికి అందుతున్నాయా లేదా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ధన్వాడలో ఇంతవరకు క్రీడా ప్రాంగణాలను ఎందుకు గుర్తించలేదని ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పాజీనగర్లో క్రికెట్ ఆడడానికి ఇబ్బంది ఏర్పడుతుందని క్రీడాకారులు వాపోతున్నారని ఎంపీడీవో సద్గుణ తెలిపారు. మోడల్స్కూల్ దగ్గర ఏర్పాటు చేస్తే పక్కనే బాలికల పాఠశాల ఉందని వారికి ఇబ్బంది కలుగుతుందని, అదేవిధంగా దూరం చాలా అవుతుందన్నారు. ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో ఖాళీ మైదానం ఉంటే అక్కడే ఏర్పాటు చేయమని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో మురళి, ఎంపీడీవో సద్గుణ,తాసిల్దార్ రమేశ్, ఎంపీటీసీ ఉమేశ్కుమార్, చిట్టెం అమరేందర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు సునీల్ రెడ్డి తదితరులు పాల్గ్గొన్నారు.
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
నారాయణ పేట్, జూన్ 8: ఆజాదీకా ఆమృత్ మహోత్స వ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రుణమేళా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళలకు రుణ మేళాను నిర్వహించినట్లు తెలిపారు. చాలా మంది మహిళలు వడ్డీలేని రుణాలు తీసుకొని వ్యాపారాల ద్వారా ఆర్థికాభివృద్ధి చెందుతున్నారన్నారు. శిక్షణ పొందిన మహిళలు బ్లాక్ పెయిటింగ్, జూట్ బ్యాగుల తయారీ, డెయిరీ ఫాం ఏర్పాటు తదితర వాటికి గ్రూపు లోన్లు పొందవచ్చన్నారు. మహిళలలకు ఎస్హెచ్జీ రుణాలు రూ.15.32 కోట్లు, వ్యాపార రుణాలు రూ.2.76 కోట్లు, కారు లోన్లు రూ.30 లక్షలు కలెక్టర్ మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్బీఐ ఏజీఎం వెంకటరాములు, ఆయా బ్యాంకుల అధికారులు, అదనపు డీఆర్డీవో అంజయ్య, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.