గద్వాల, డిసెంబర్ 20 : జోగుళాంబ గద్వాల జిల్లా సివిల్ సప్లయ్ శాఖ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారి అండదండలు మిల్లర్లకు ఉండడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మిల్లర్లు చెప్పిన వారికే ధాన్యం కేటాయించడం మొదలు.. తప్పు చేసిన వారిని రక్షించే వరకు సహకరిస్తుండడంతో జిల్లాలో సుమారు రూ.10 కోట్ల విలువ చేసే ధాన్యం మాయమైంది. ఈ విషయం జిల్లా సివిల్ సప్ల య్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదు. దీంతో ఆరోపణలు వచ్చిన మిల్లులపై ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. పేదలకు ఆహార భద్రత పథకం కింద పంపిణీ చేసేందుకుగానూ సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వడం కోసం రైస్ మిల్లర్లకు ప్రభు త్వం ధాన్యం అప్పగిస్తుంటుంది. అయితే, ఆ ధాన్యాన్ని కొందరు మిల్లర్లు అమ్ముకోవడంతోపాటు రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి సీఎంఆర్ భర్తీ చేస్తున్నారు. రేషన్ బియ్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో ఓ ముఠానే కొలువుదీరిం ది. వారు రేషన్ బియ్యా న్ని సేకరించి మిల్లర్లకు ఇస్తున్నట్లు సమాచారం. నలుగురు మిల్లర్లు నిత్యం డీఎస్వో కార్యాలయంలో పైరవీలు చేసుకుంటూ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. వాళ్లు చెప్పిం దే డీఎస్వోకు వేదం. ముఠా అక్రమాలపై వివరణ అడిగేందుకు వెళ్లిన పాత్రికేయులపై ఆ అధికారి చిందులు తొక్కడం పరిపాటిగా మారింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2021-22 వానకాలం, యాసంగికి సంబంధించి మిల్లర్లు 19,106 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు 10,491 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. 2022-2023 వానకాలం సీజన్లో 28,904 మెట్రిక్ టన్నులకు గానూ 19,978 మెట్రిక్ టన్నులు ఇవ్వగా..
5,662 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉన్నది. 2022-2023 యాసంగికి సంబంధించి 24,684 మెట్రిక్ టన్నులకు గానూ ఇప్పటివరకు 1,131 టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. గడు వు ముగిసినా మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. 2022-23 వానకాలానికి సంబంధించి 34 మిల్లులకు ధాన్యం కేటాయించగా.. వారి నుంచి డిసెంబర్ 12వ తేదీ నాటికి కేవ లం 5 శాతం బియ్యం మాత్రమే సేకరించినట్లు అధికారులే చెప్పడం విశేషం. గడువు సమీపిస్తున్నా పెండిం గ్ ధాన్యం డెలివరీ చేయడంలేదు. అయితే, కొందరు మిల్లర్లు ఈ వడ్ల ను అమ్ముకొని సొ మ్ము చేసుకున్నట్లు తెలిసింది. జిల్లాలోని మూడు మిల్లుల్లో సుమారు 108 ఏసీకేలు (ఒక ఏసీకేకు 290 క్వింటాళ్లు) అమ్ముకొని రూ. 10కోట్ల మేర కూడబెట్టుకున్నట్లు సమాచారం. అధికారులకు మామూళ్లు ముట్టడంతో ఈ విషయం గురించి అస్సలు ఆలోచించడం లేద నే ఆరోపణలు వినిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మిల్లులపై దాడులు చేసి ఏడు నెలలు కావస్తున్నా ఫలితం లేదు. సివిల్ సప్లయ్ శాఖ అధికారులు కేసులతో చేతులు దులుపుకున్నారే తప్పా రికవరీ చేయలేదు. ఇటీవల ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు అధికారులతో సమీక్ష నిర్వహించి సీఎంఆర్ ధాన్యం పక్కదారిపై ఆరా తీశారు. సంబంధిత శాఖ అధికారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అక్రమాలకు బలం చేకూరింది. ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా వడ్లను అ మ్ముకున్న వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంత్రి ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం విశేషం.
రైస్ మిల్లర్లకు సివిల్ సప్లయి అధికారుల నుంచి సహాయసహకారాలు అందుతుండడంతో వారు చెప్పిందే వేదంగా మారింది. నిత్యం కార్యాలయంలో కూర్చొని వారికి అనుకూలమైన మిల్లులకు యాసంగి, వానకాలం వడ్లను కేటాయిస్తున్నారంటే ఇక్కడ వారి ప్రాబల్యం ఎంత ఉందో తెలిసిపోతుంది. గతంలో పీడీఎస్ రీ సైక్లింగ్కు సంబంధించి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తికి చెందిన మిల్లుకు ధాన్యం కేటాయించారంటే అధికారుల పనితీరు ఏంటో అర్థమవుతున్నది. సివిల్ సప్లయ్శాఖలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకున్న మిల్లర్లకు రైస్మిల్లు లేకున్నా లీజు డాక్యుమెంట్లు పెట్టుకొని రూ.కోట్ల విలువ చేసే సీఎంఆర్ వడ్లకు అధికారులు పర్మీషన్ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా లీజు తీసుకున్న మిల్లులకు సీఎంఆర్ వడ్లు ఎక్కువగా కేటాయించకూడదు, వడ్లకు సరిపడా ష్యూరిటీ ఉంటేనే ఇవ్వాలి కానీ ఇక్కడి అధికారి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టారీతిలో వడ్లు కేటాయించినట్లు తెలుస్తున్నది. జిల్లాలో 12 మంది రైస్మిల్లర్లు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్టాక్ పొజిషన్ లెక్కలపై ఒక కమిటీ వేసి క్షేత్రస్థాయిలో జిల్లాలోని అన్ని మిల్లులను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేస్తే మరిన్ని మిల్లుల బాగోతం బయటపడే అవకాశం ఉన్నది.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మే నెలలో జిల్లాలోని మూడు రైస్ మిల్లులపై దాడులు నిర్వహించారు. అయిజలోని అన్నపూర్ణ మిల్లుకు 60.24 ఏసీకేలు, గద్వాల మండలం కాకులారంలో ఉన్న కృష్ణారైస్ మిల్లుకు 28.69 ఏసీకేలు, వడ్డేపల్లి మండలంలోని సూర్యట్రేడర్స్ మిల్లుకు 36.82 ఏసీకేలు కేటాయించారు. ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేసే సమయానికి ఈ మొత్తం వడ్లకు సంబంధించి కేవలం 16.02 ఏసీకేల బియ్యాన్ని మాత్రమే అప్పగించారు. అందుకు సంబంధించిన ధాన్యం మిల్లులో నిల్వ ఉండాలి. కానీ అన్నపూర్ణ, కృష్ణా మిల్లుల్లో మిగతా ధాన్యం మాయమైంది. తనిఖీ సమయంలో అన్నపూర్ణ మిల్లులో కేవలం 1,716 బస్తాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కృష్ణా మిల్లులో ధాన్యం నిల్వ లేకపోవడంతో ఈ రెండు మిల్లుల యజమానులపై కేసులు నమోదు చేశారు. వీటితోపాటు అయిజలోని శ్రీనివాస రైస్మిల్లు, కేటీదొడ్డి మండలంలో నందిన్నె గ్రామ శివారులో ఉన్న మిల్లులో అధికారులు దాడులు చేశారు. అయితే ముందస్తు సమాచారం అందుకున్న యజమానులు మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులతో పాత ధాన్యం అని ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చెప్పించి కేసులు నమోదు కాకుండా చేశారు.