ఈనెల 26వ తేదీన అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ అచ్చంపేటకు వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ బహిరంగ సందర్భంగా అచ్చంపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభకు లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, వచ్చిన జనాన్ని చూసి కాంగ్రెస్కు దిమ్మతిరగాలని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని రాద్ధాంతాలు చేసినా అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష అన్నారు.
అచ్చంపేట, అక్టోబర్ 21 : తెలంగాణ అభివృద్ధి ప్రధాత సీఎం కేసీఆర్ ఈనెల 26న అచ్చంపేట పర్యటనకు వస్తున్నందునా లక్షమందితో సభ నిర్వహించి సునామీ సృష్టించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం సాయంత్రం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లక్ష మందిని సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గం నుంచి తరలించేందుకు జనసమీకరణ చేస్తున్నామన్నారు. అచ్చంపేటలోని అటవీశాఖ కార్యాలయం సమీపంలో ఇటీవల మంత్రి కేటీఆర్ సభ కోసం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దనే బహిరంగ సభ ఉంటుందన్నారు. అదేరోజు సీఎం కేసీఆర్ మూడుసభలు ఉన్నందునా అచ్చంపేట నియోజజకవర్గ ప్రజలు ఉదయం 11:30 గంటల వరకు సభకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. అచ్చంపేట అభివృద్ధి కోసం సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు నివేదికను రూపొందిస్తున్నామన్నారు. దళితబంధు పథకాన్ని నియోజకవర్గవ్యాప్తంగా అందించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. బీసీలు, మైనార్టీలు అధికంగా ఉన్నందునా బీసీ, మైనార్టీబంధు ఎక్కువ యూనిట్లు మంజూరు చేయించుకోవడం, గృహలక్ష్మీకి డిమాండ్ ఎక్కువగా ఉన్నందునా దాదాపు 5వేల నుంచి 10వేల వరకు మంజూరు చేసేలా, పరిశ్రమల ఏర్పాటు, విద్యాపరంగా, ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు కోరనున్నట్లు చెప్పారు.
సీఎం సభకు తరలివచ్చే జనసమీకరణ ద్వారా బీఆర్ఎస్ విజయం ఖాయమవుతుందన్నారు. నవంబర్ నెలాఖరున మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటుందన్నారు. ఈసారి అచ్చంపేటలో ఖచ్చితంగా 50వేల మెజార్టీతో గులాబీజెండా ఎగురవేస్తామన్నారు. ప్రజలు, రైతులు, దళితులు, పేదలు, గిరిజనులు, మైనార్టీలు వివిధ సామాజికవర్గాల వారు బీఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోను గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని కోరారు. వాస్తవాలను ప్రజలకు వివరించి చైతన్యం చేయాలని సూచించారు. కాంగ్రెస్ చేస్తున్న బోగస్ ప్రచారాలు, అబద్ధాలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి లబ్ధిపొందాలని కాంగ్రెస్ చూస్తున్నదని విమర్శించారు. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తుచేసి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ, సర్పంచ్ లోక్యానాయక్, ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీ రాంబాబు, మైనార్టీ నాయకులు అమీనొద్దీన్, లాలుయాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగయ్యగౌడ్, పదర వైస్ ఎంపీపీ వరుణ్, ప్రతాప్రెడ్డి, తిరుపతియాదవ్, ఉస్సేన్, గోపాల్నాయక్, మండల అధ్యక్షుడు తిర్పతయ్య, సింగిల్విండో చైర్మన్ నర్సయ్యయాదవ్, వైస్ ఎంపీపీ నారాయణ, బంగారు నర్సింహ, విష్ణుమూర్తి, శంకర్మాదిగ తదితరులు పాల్గొన్నారు.