గులాబీ శ్రేణుల్లో నూతన జోష్ నెలకొన్నది. గురువారం అచ్చంపేట, వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. జనం నుంచి అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది. ఎక్కడ చూసినా గులాబీ ప్రభంజనం కనిపించింది. సీఎం కేసీఆర్ను చూసేందుకు లక్షలాదిగా కదిలిరాగా.. రెండు సభలు జన ఉప్పెనను తలపించాయి. అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో కదంతొక్కారు. జనాదరణ చూస్తే వార్ వన్సైడే.. అని గులాబీ దళపతి చెప్పగానే సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మార్మోగింది. గులాబీ పార్టీ అభ్యర్థుల్లో గెలుపుపై మరింత విశ్వాసం పెరిగింది. గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, తండాలు, గూడెలు నీరాజనం పలుకుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రచారంలో దూకుడు పెంచింది. వివిధ పార్టీల నుంచి వలసలు వస్తుండడంతో పార్టీ రోజురోజుకూ మరింత బలోపేతమవుతున్నది. పార్టీశ్రేణులు మరోత్సాహానికి సై అంటుండగా.. ప్రతిపక్షాలు మాత్రం కారు స్పీడ్ను అందుకోలేక కుదేలవుతున్నాయి.
వనపర్తి , అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : వనపర్తిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ అయింది. సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు నూతనోత్సాహంలో మునిగిపోయారు. నియోజక వర్గంలో ఇతర పార్టీల ఊసేలేని క్రమంలో రెండు నెలలుగా బీఆర్ఎస్ ప్రచార నిర్వహణలో విజయ ఢంకా మోగిస్తున్నది. ఎన్నికల షెడ్యూల్ విడు దలకు ముందు నుంచే వివిధ వర్గాల సమ్మేళనాలను నియోజకవర్గమంతటా నిర్వహించి బీఆర్ఎస్ దూకుడు పెంచింది. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్య ర్థులను ప్రకటించి బీఫారంలను అందజేయడంతో క్రమ తప్పకుండా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ స్పీడ్ పెంచింది. ప్రజా ఆశీర్వాద సభలోను సీఎం కేసీఆర్ మంత్రి నిరంజన్రెడ్డి చేసిన అభివృద్ధిని, అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో సింగిరెడ్డి ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. గతంలో మాదిరిగానే మళ్లీ మీరు నిరంజన్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ..మిగితా పని నేను చూసుకుంటా అన్నట్లు సభలో ఓటర్లకు గెలుపు బాధ్యతను అప్పగించారు ముఖ్యమంత్రి. నిత్యం జనంలో ఉంటూ ప్రాంత అభివృద్ధి కోసం పరితపించే నిరంజన్ రెడ్డిలాంటి వ్యక్తులను ప్రజలుగా మీరు ఆదరించాలని, అలాంటప్పుడే ఈప్రాంతం మరింతగా వృద్ధిలోకి వస్తుందని సీఎం భరోసాగా చెప్పారు.
వరుస చేరికలతో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతున్నది. గడిచిన 3నెలలుగా గ్రామాల్లో ఉన్న ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరిపోయారు. ఇంకా అక్కడక్కడ మిగిలిన వారు సహితం గులాబీ కండువా కప్పుకోవడంతో ఇతర పార్టీలన్నీ ఖాళీ అవుతున్నాయి. దీంతో నియోజవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా ఎదుగుతున్నది. ఇటీవల మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో నియోజకవర్గంలో కొత్త జోష్ కనిపిస్తున్నది. ప్రజా ఆశీర్వాద సభలోనూ గోపాల్పేట మండలానికి చెందిన నాగం తిరుపతిరెడ్డి కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఇక ప్రతి రోజూ మంత్రి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి చేరికల కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. అభివృద్ధి, ఇతర సంక్షేమ పథకాలపై ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారు. మంత్రి కూడా గతంలో కంటే ఎక్కువగా నియోజకవర్గంలోనే ఉంటూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశా..నిర్దేశం చేస్తూ గులాబీ శ్రేణులను అప్రమత్తంగా ఉంచుతున్నారు. పార్టీలో కొత్తగా చేరుతున్న వారికి పాత కార్యవర్గాన్ని సమన్వయం చేస్తూ ఎలాంటి ఒడిదుడులకు లోనుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
వనపర్తి కోటపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని బీఆర్ఎస్ భరోసాగా ఉన్నది. ముందు నుంచి ప్రణాళికతో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న పార్టీ బాధ్యులు గతంలో కంటే మెరుగైన పరిస్థితుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి సింగిరెడ్డి నుంచి మొదలుకుని వివిధ హోదాల్లో పదవులను నిర్వహిస్తున్న నాయకులు, మండలాల బాధ్యులు రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకుంటూ పార్టీ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. నోటిఫికేషన్కు ముందు నుంచి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీగా గడిపిన మంత్రి నిత్యం ప్రజా క్షేత్రంలోనే గడుపుతున్నారు. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలతో నడుస్తూ ఇంటింటికీ వెళ్లి మంత్రి ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి కోటపై మరోసారి గులాబీ జెండాను ఎగరవేస్తామని బీఆర్ఎస్ గట్టి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నది.
నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల అలికిడి లేకుండా పోయింది. బీఆర్ఎస్ మిన హా ఇతర పార్టీల నుంచి అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడంతో గందరగోళం నెలకొన్నది. ఉన్న క్యాడర్ కూడా ఆయోమయ సంకటస్థితిని ఎదుర్కొంటున్నది. గడచిన ఐదేండ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు దూరంగానే కొనసాగాయి. ప్రజల వద్దకు వెళ్లేందుకు ఏ సమస్యా ప్రధానంగా లేకపోగా, నామమాత్రంగా కొన్ని పార్టీలు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశాయి. ఉద్యమ పంథాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల ధాటికి ప్రతిపక్షాలు వెలవెలబోతున్నాయి. ఇదంతా గమనిస్తున్న ఆయా పార్టీల క్యాడర్ ఇప్పటికే బీఆర్ఎస్లోకి వలసబాట పట్టింది.