ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండో విడుత కంటి వెలుగుతో గిన్నిస్ రికార్డు సాధించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఫంక్షన్హాల్లో రెండో విడుత కంటివెలుగు సన్నాహక కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రాములు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి,కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 18 నుంచి కంటి వెలుగుకు ఏర్పాట్లు చేశామన్నారు. యువత మొదలు వృద్ధుల వరకు కంటి చికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో చదువుకునే చిన్నారులకు పరీక్షలు నిర్వహించే అంశాన్ని పరిశీలి స్తామన్నారు. నాలుగేండ్లల్లోనే రాష్ట్రంలో వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. సంక్షేమ పథకాలతోపాటు తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా.. అగ్రగామిగా నిలిచిందన్నారు.
వనపర్తి, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : ఏకకాలంలో సమాజం మొత్తాన్ని స్క్రీనింగ్ చేసి చికిత్స అందజేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం గిన్నిస్ రికార్డులోకి ఎక్కడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. అంధత్వాన్ని దూరం చేయడమే లక్ష్యంగా ముందు చూపుతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఫంక్షన్హాల్లో రెండో విడుత కంటివెలుగు సన్నాహక కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ రాము లు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
18 నుంచి ప్రారంభమయ్యే రెండో విడుత కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. 18 ఏండ్లు నిండిన యువత నుంచి వృద్ధుల వరకు కంటి చికిత్సలు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్లో చదువుకునే చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. గతంలో సరైన పోషకాహారం అందక, జన్యుపరమైన ఇబ్బందులతో కంటిపై ప్రభావం పడి కంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగై కోరింది తినే స్థితి వచ్చిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, ఇందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలే కారణమని కొనియాడారు.
వ్యవసాయం, పారిశ్రామిక రంగంతోపాటు అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరడంతో ప్రజలు పనులు చేసుకుంటున్నారని వివరించారు. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని అన్నారు. దీంతో పౌష్టికాహార సమస్య ప్రస్తుతం లేదన్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యవంతమైన శిశు జననాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. వచ్చే నాలుగేండ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను కేవలం తెలంగాణ మాత్రమే అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
కంటివెలుగులో వనపర్తి జిల్లా రాష్ట్రంలోనే నెంబర్వన్గా నిలబడాలన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు జిల్లాకు మించి ముందు వరుసలో ఉంచాలని సూచించారు. గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో కంటి వెలుగు పథకాన్ని విజయవం తం చేయడానికి కనీసం 30 రోజులు గ్రామాల్లో బస చేస్తానన్నారు. జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. జిల్లాలోని 71 రైతు వేదికలను ఉపయోగించాలన్నారు. వంద రోజులపాటు జరిగే కార్యక్రమంలో భాగంగా 255 పంచాయతీల్లో 80 మున్సిపల్ వార్డుల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. 28 బృందాలు పనిచేసి 4.52 లక్షల మందికి కంటి పరీక్షలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
కంటి చూపు సమస్యతో ఎవరూ ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ముందుచూపుతో కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని ఎంపీ రాములు తెలిపారు. అందరూ బాధ్యతగా తీసుకొని వందశాతం కంటి పరీక్షలు చేయించేలా విజయవంత చేయాలని పిలుపునిచ్చారు. కంటివెలుగు జీవితానికి వెలుగని అభిప్రాయపడ్డారు. వనపర్తిని మంత్రి నిరంజన్రెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.
ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. పరీక్షలు నిర్వహించిన వెంటనే రీడింగ్ అద్దాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే చికిత్స అందజేసి కంటి అద్దాలను ఇంటికే పంపించనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు గ్రామాల్లో 300 మందికి పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన కంటివెలుగు రేపటి కంట్రీ వెలుగని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని చేపడుతున్నదన్నారు. కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ కంటి సమస్యలను నివారించడానికి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, ఎస్పీ అపూర్వారావు, అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, వేణుగోపాల్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, ఆర్డీవో పద్మావతి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, డీఎంహెచ్వో రవిశంకర్, ఏవో సాయినాథ్, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక, పెబ్బేరు మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిట్యాల రాము, నాయకులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిరంజన్రెడ్డి శంకుస్థాపన చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం పరిధిలో 50 పడకల క్రిటికల్ కేర్ యూని ట్ నిర్మాణానికి, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జనరిక్ ఫార్మసీ స్టోర్కు శంకుస్థాపన చేశారు.