పాలమూరులో ఆదివారం నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగసభ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ క్రెడిట్ ఈ జిల్లాదేనని చెప్పడంతో సంబురపడుతున్నారు. జాతీయ రాజకీయాల్లో పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించబోతుందనే సంకేతంతో ఎక్క డ చూసినా ఇదే చర్చ జరుగుతున్నది. పాలమూరు పచ్చబడ్డదని.. ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్న కృషిని వివరించడంతో అభిమానులు, ప్రజలు పార్టీ శ్రేణులు చప్పట్లతో స్వాగతించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ చేస్తున్న అభివృద్ధి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి జిల్లాలో పర్యటించిన విషయాన్ని, వనపర్తిలో జలశయాలను నిర్మించినందుకే నీళ్ల నిరంజన్రెడ్డి అని పేరు వచ్చిందని బాహటంగా ప్రకటించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అత్యధికంగా చెక్డ్యాంలు నిర్మించాడని చెప్పడంతో అభిమానులు హర్షించారు.
మహబూబ్నగర్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగసభ ఊహించనివిధంగా విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాను కీర్తించడంతోపాటు తెలంగాణ ఉద్యమ క్రెడిట్ అంతా ఈ జిల్లాదేనని చెప్పడంతో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు సంబురపడుతున్నారు. జాతీయ రాజకీయాల ప్రస్తావన తీసుకొచ్చి ‘మీరు అండగా నిలిస్తే నేను అక్కడ గట్టిగా కొట్లాడుతా’ అని పిలుపు ఇవ్వడంతో ఉత్సాహం మరింత రెట్టింపయింది. జాతీయ రాజకీయాల్లో పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించబోతుందనే సంకేతంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతున్నది. గ్రామాల్లో ఇక కేంద్రం పని పడ్తాడంట..దేశంలో కూడా రైతులకు ఉచిత కరెంట్, రైతుబంధు ఇస్తాడంట అనే చర్చ ఊపందుకున్నది.
ఉద్యమ అనుభవాలను గుర్తుచేసుకున్న సీఎం.. జిల్లామీద ఉన్న అభిమానాన్ని మారోమారు చాటుకున్నారు. పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు చేస్తున్న కృషిని వివరించారు. జిల్లాకు మంత్రి శ్రీనివాస్గౌడ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. ఉద్యమ సమయంలో జిల్లాకు వచ్చినప్పుడు ఎదురైన అనుభవాలను పూసగుచ్చినట్లు వివరించారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి జిల్లాలో పర్యటించిన విషయాన్ని వివరిస్తూ అప్పటి పరిస్థితులను తలుచుకున్నారు. వనపర్తిలో జలాశయాలను నిర్మించినందుకే నీళ్ల నిరంజన్రెడ్డి అని పేరు వచ్చిందని అన్నారు.
దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి వాగులపై చెక్డ్యాంలు నిర్మించి జలసిరులను సృష్టించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజాప్రతినిధులంటే ఇలా ఉండాలి అంటూ సభాముఖంగా చెప్పారు. ఎమ్మెల్యేలు అడగకున్నా ప్రతి నియోజకవర్గానికి అదనంగా రూ.15కోట్ల నియోజకవర్గ నిధులను సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా, టీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు ఆటంకం కల్పించాలని ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలమయ్యాయి. ఉహించని రీతిలో సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఖంగుతిన్నారు. ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ మైదానం చరిత్రలో లేనివిధంగా జనం హాజరు కావడం ఒక రికార్డేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన ఖరారైనప్పటి నుంచి జిల్లా మంత్రి శ్రీనివాస్గౌడ్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలను ఏకం చేశారు. నవంబర్ 23న జిల్లా కేంద్రంలోని తన ఫాంహౌస్లో సహచర మంత్రి నిరంజన్రెడ్డితోపాటు 12మంది శాసనసభ్యులతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించారు. టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీ అంటూ దాడులు చేస్తున్నదని, మనమంతా ఏకతాటిపై ఉండాలని చర్చించారు. మరోవైపు సీఎం కేసీఆర్ సభకు అందరం సమిష్టిగా కృషి చేసి పార్టీ నేతలు, కార్యకర్తలను సన్నద్ధం చేయాలని తీర్మానించారు.
అనుకున్నది అనుకున్నట్లే ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ఏకమై సీఎం పర్యటనను విజయవంతం చేశారు. జనసమీకరణలో పోటీపడ్డారు. మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేశారు. ఆయా నియోజకవర్గాల నుంచి 10వేలమందిని సమీకరించారు. దూరం ఉన్న జిల్లాల్లో ముఖ్యనేతలు వచ్చేలా ప్లాన్ చేశారు. సమిష్టి కృషితో సీఎం సభకు భారీగా జనసమీకరణ చేపట్టారు. ఊహించని రీతిలో మహిళలు, రైతులు, యువకులు పెద్దఎత్తున హజరయ్యారు. దీంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.
సీఎం కేసీఆర్ బహిరంగ సభ సాయంత్రం నాలుగుగంటలకు అని ప్రకటించినా.. జనం మధ్యాహ్నం రెండు గంటల నుంచే రావడం ప్రారంభించారు. అయా రూట్లలో వస్తున్న బస్సులను, కార్లకు ప్రత్యేక పార్కింగ్లను ఏర్పాటు చేసి సభా ప్రాంగణానికి వెళ్లేలా ప్లాన్ చేశారు. పోలీసులు, ట్రాఫిక్, రవాణాశాఖ అధికారులు కలిసి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో సాఫీగా జనం సభకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ సరిగ్గా 1:30 గంటలకు మహబూబ్నగర్కు చేరుకున్నారు. సభా ప్రాంగణం మీదుగానే సీఎం కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం 4:30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని సుమారు 35 నిమిషాలపాటు ప్రసంగించారు. సీఎం మాట్లాడుతున్న ప్రతిమాటకూ జనం కేరింతలు కొట్టారు. జెండాలను ఊపి అభిమానాన్ని చాటుకున్నారు. డబుల్బెడ్రూం, దళితబంధు, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం, కొత్త హౌసింగ్ స్కీమ్ చెప్పినప్పుడు జనం ఈలలు వేశారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ప్రసంగం సాగింది.
బీఆర్ఎస్ను ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్ మొదటిసారిగా మహబూబ్నగర్ వేదికగా సమరశంఖం పూరించారు. మీరు గట్టిగా చూసుకుంటానంటే.. నేను అక్కడ గట్టిగా సూసుకుంటా అని చెప్పడంతో సభలో ఒక్కసారిగా జై కేసీఆర్ నినాదాలు మిన్నంటాయి. బీఆర్ఎస్ను విస్తరించేందుకు పావులు కదుపుతున్నట్లు కార్యకర్తలకు ముందస్తు సూచనలు చేశారు. దీంతో గ్రామాల్లో ఇదే చర్చ సాగుతున్నది. పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్తే ఏ ఏ రాష్ర్టాల్లో మద్దతు ఇస్తారనే చర్చ జోరుగా జరుగుతున్నది. మరోవైపు మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన కొంతమంది తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని కూడా సీఎం వివరించారు. మొత్తమ్మీద ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్, బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇటీవల రాహుల్గాంధీ చేపట్టిన జోడోయాత్ర అట్టర్ప్లాప్ కావడం, బీజేపీ చేపడుతున్న భరోసాయాత్రకు ప్రజా స్పందన అంతంతమాత్రంగానే రావడంతో పార్టీ నేతలు ఖంగుతింటున్నారు. ఉన్న క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నంలో మునిగిపోయారు.
నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి చాంబర్లో సీఎం కేసీఆర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్యనేతలతో ముచ్చటించారు. జిల్లా స్థితుగతులను మంత్రులు వివరించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 14 స్థానాల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గాల్లోనే ఉండి పార్టీని మరింత బలోపేతం చేయాలని కేసీఆర్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇతర పార్టీల ముఖ్యనేతలు టీఆర్ఎస్లో చేరారని, మిగతా వారు కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ సమావేశాలను రెగ్యులర్గా నిర్వహించి కార్యకర్తలు, నాయకులను సమాయాత్తం చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏకతాటిపైకి రావడంపై సీఎం అభినందించారు.