ఉమ్మడి పాలమూరులో సంక్షేమ సౌరభాలు వెల్లివిరుస్తున్నాయి. పేదలకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాలు పేదలకు కొండంత అండగా నిలిచాయి. నిజమైన అర్హులకే సాయం అందుతుండడంతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఎదిగాయి. ఏ ప్రభుత్వం ఇలాంటి పథకాలు ఇయ్యలేదని, సీఎం కేసీఆర్ మా పెద్ద కొడుకులా చేయూతనిస్తున్నారని పలువురు దీవిస్తున్నారు.
పింఛన్ ఆదెరువు.. నెల నెల జీతంలా..
రెండున్నర ఎకరాల పొలం ఉంది. మెట్ట పొలం కావడంతో వర్షం పడితేనే ఏదైనాపంట చేతికొచ్చేది. భర్త అనారోగ్యంతో తనువుచాలించాడు. కొడుకు బతుకు దెరువుకు పట్నం పోయాడు. ఒక్కసారిగా బతుకంత చీకటిగా మారిపోయింది. బతుకు సాగేది ఎలా అనే ప్రశ్న ఆమె ముందు నిలబడింది.ఆ ప్రశ్నకు సమాధానం ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో వచ్చింది. ఆ సమాధానమే ఇప్పటికి ఆమెకు అండగా, ఆదెరువుగా ఉంది. ఆమె పేరు తుమ్మేటి అంజనమ్మ.చారకొండ మండలం మర్రిపల్లి గ్రామం.
అంజనమ్మ భర్త పేరు వెంకట్రెడ్డి. రెండెకరాల వ్యవసాయ పొలం ఉంది కాని..వర్షం పడితేనే మెట్ట పండే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో భర్త వెంకట్రెడ్డి అనార్యోగ్యంతో 2014లో చనిపోయాడు. ఊరిలో బతుకుదెరువు లేని పరిస్థితి వచ్చింది.ఒక్కగానొక్క కొడుకు బతుకు దెరువుకు పట్నం బాట పట్టాడు. ఒంటరి తనం దీనికి తోడు రోజెలా గడుస్తుందనే ప్రశ్న.అప్పుడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఆధిరోహించడంతోనే అంజనమ్మ కష్టాలకు తెరపడింది. భర్తను కోల్పోయిన అంజనమ్మకు రూ.1016 ఫించన్ మంజూరైంది.ఎవ్వరిని యాచించకుండా పొట్ట బట్టకు చావులేదనుకుంది.
నాలుగు సంవత్సరాల తర్వాత అదే ఫించన్ రూ.2016కు చేరుకొంది.ఎవ్వరిపై ఆధారపడకుండా ఉన్న వ్యవసాయ పొలంలో చాలనయినంత వ్యవసాయం చేసుకుంటూ గౌరవ ప్రదంగా ముందుకు సాగుతుంది.పండుగలకు, పబ్బాలకు కొడుకు, కోడలు, పిల్లలు పట్నం నుంచి వస్తే.. వారికి ప్రతి నెల మిగిలిన ఫింఛ న్ డబ్బులతో బట్టలు కొనుగోలు చేసి ఇస్తుంది.బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ఫింఛన్ వితంతు మహిళ జీవితంలో వెలుగులు నింపుతుంది. ఇదే విషయమై అంజనమ్మతో మాట్లాడితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ను వేయినోళ్ళ పొగుడుతుంది.తనకు దేవుడిచ్చిన పెద్ద కొడుకు కేసీఆర్ అంటుం ది.కేసీఆర్ ఉన్నంత వరకు తన జీవితానికి ఏలాంటి డోకా లేదంటుంది. నెలనెలా జీతంలా పించన్ టంచన్గా వస్తుం ది. ఎవ్వరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు.కొడకు.కోడలి ముందు చేయి చాచాల్సిన పరిస్థితి లేదు. ఈ వయస్సులో మాకు అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషంగా సుఖంగా ఉండాలని అంజనమ్మ అంటుంది. – అంజనమ్మ, కల్వకుర్తి
ఒంటరి మహిళలకు అండగా..
సమాజంలో ఒంటరి మహిళల పరిస్థితి ఇబ్బందిగా ఉంది. అటు తల్లిదండ్రులు పట్టించుకోకపోగా ఇటు మెట్టినింటి వారు ఆదరరించగా ఇబ్బందులు పడేవారు. తాము కూలి చేస్తే వచ్చే డబ్బుతో జీవనం కొనసాగించేవాళ్లం. ప్రస్తుతం వయస్సు పైబడడంతో కూలి పనులకు వెళ్లలేం. ప్రభుత్వం అందిస్తున్న ఒంటరి మహిళా పింఛన్ మా లాంటి వారికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. ప్రభుత్వం అందించే సాయంతో గోలీబిల్లలు కొనుగోలు చేయడం.. చాయి ఖర్చులు వెల్లదీస్తున్నాను. లేదంటే సొంత ఖర్చుల కోసం కుటుంబంపై ఆధారపడాల్సి వచ్చేది. పింఛన్ వస్తుండడంతో ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లేవు.
– ఏమేలమ్మ, జమ్మిచేడు, జోగుళాంబ గద్వాల జిల్లా
కేసీఆర్ సారు.. మా దేవుడు
చేతకాని మాలాంటోళ్లకు తండ్రిలా పింఛన్లు చేసి సీఎంకేసీఆర్ సారు మాకు దేవుడయిండు. మా పెద్దాయన ముప్పై ఏండ్ల కిందట కాలం అయిండు. నాకు నలుగురు కొడుకులు, ఒక బిడ్డ. అందరికీ పెండ్లిలై మనుమళ్లు, మనుమరాళ్లున్నారు. బతుకుదెరువు కోసం ఎవరి తిప్పలు వాళ్లు పట్టణాలకు పోయిండ్రు. కేసీఆర్ సర్కార్ వచ్చినంకా నాకు పింఛన్ వచ్చి పదేండ్లవుతుంది. అంతకు ముందు కూలికి పోతుంటి. కిందపడి నడువలేక పోతున్న. పొద్దుపొడిచిన నుంచి పొద్దుగుంకే వరకు మాలాంటి ముసళ్లోలను కేసీఆర్ సారూ సన్న పిల్లలను సాకినట్లు సాకుతుండ్రు. కండ్లు మసకబారి కనిపించకపోవడంతో వంట చేసుకునేందుకు సత్తువ చాలదు. పింఛన్ పైసలతో నా జీవనం సాగుతున్నది.
– బిల్లసుంకులమ్మ, అంబేద్కర్కాలనీ, కొల్లాపూర్, నాగర్కర్నూల్ జిల్లా
బీసీ లోన్తో ఇంటి రేకుల నిర్మాణం
తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ బీసీ కులవృత్తులకు రూ.లక్ష రుణం ఇవ్వడంతో మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన వల్లూరి యాదమ్మ ఇంటి పైకప్పును తీసివేసి కొత్త రేకులు వేసుకున్నది. అనారోగ్యంతో భర్త శేఖరాచారి మూడేండ్ల క్రితం మృతి చెందాడు. ఇటీవల బీసీలోన్కు ఆమె దరఖాస్తు చేసుకోవడంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేతుల మీదుగా చెక్కు అందుకున్నది. ఆ డబ్బులతో పాత
ఇంటి పైకప్పు కోసం రేకులతో నిర్మాణం పూర్తి చేసుకున్నది.
ఇంటోళ్లపై ఆధారపడకుండా..
జమ్మిచేడు, జోగు ళాంబ గద్వాల జిల్లా గతంలో నాకు పైసలు అ వసరమైతే ఇంటి వారిపై ఆధా రపడాల్సి వచ్చేది. ఒక్కోసారి పండు గలకు ఇంటికి మనవడు, మనవరాలు వస్తే వారు అడిగితే ఇవ్వడానికి నా దగ్గర చిల్లిగవ్వ ఉండేది కాదు. ప్రభుత్వం ఆసరా పింఛన్ పెంచడంతో ప్రతి నెలా రూ.2,016 వస్తుండడంతో ఇంటి వారిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండాపోయింది. ఈ పైసలతో నాకు కావాల్సిన మందులు కొనుగోలు చేసుకుంటున్నాను.. ఇంటికొచ్చే ఆడబిడ్డ, వారి పిల్లలకు ఎంతో కొంత ఇస్తున్నా.. ఈ పరిస్థితి కల్పించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు..
– బీసమ్మ, జమ్మిచేడు, గద్వాల జిల్లా