అమరచింత(ఆత్మకూర్) అక్టోబర్ 9 : గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలు ఇచ్చి వాటికి అమలు చేయక ప్రజలకు అనేక విధాలుగా బాకీ పడ్డారని, ఈ బాకీలపై ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆత్మకూర్ మండలం మూలమళ్ల గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం మండల నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమవ్వడమే కాకుండా అధికారం చేపట్టిన 22 నెలల్లో రూ.లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేవలం వంద రోజుల్లో రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీతో పాటు ఎకరాకు రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని, పింఛన్లు రెట్టింపు చేస్తామని, విద్యార్థినులకు స్కూటీలు అందిస్తామని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయకుం డా ప్రజలను పూర్తిగా వంచించారని ఆరోపించారు.
అంతేకాకుండా గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు నేడు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు వీరిని నిలదీయాలని, బీఆర్ఎస్ అందజేసిన బాకీ కార్డులను చూపించి వాటిని వాటిని చెల్లిస్తేనే ఓట్లు వేస్తామని చెప్పాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ వేణుగోపాల్రెడ్డితోపాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్యాదవ్, పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గులాబీ గూటికి చేరిన వివిధ పార్టీల నేతలు ఆత్మకూర్ మండలం మూలమళ్ల గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.