కల్వకుర్తి, నవంబర్ 19 : బీఆర్ఎస్కు ఓటేసి జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే కల్వకుర్తి నియోజకవర్గానికి పాలమూరు- రంగారెడ్డి ఎతిక్తపోతల పథకం ద్వారా 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. మహాత్మాగాంధీ, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా కల్వకుర్తి నియోజకవర్గానికి దాదాపు 90 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు మద్దతుగా ఆదివారం సాయంత్రం కల్వకుర్తిలో నిర్వహించిన ప్రజాఆశీర్వాధ సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పరిపాలన కాలంలో కల్వకుర్తి నియోజకవర్గ బిడ్డలు పడ్డ కష్టాలను ముఖ్యమంత్రి మరోసారి గుర్తుకు తీసుకువచ్చారు. కరెంట్లేక, సాగునీరు లేక, వ్యవసాయా లు లేక, బతకనీకే సౌలతులు లేక వలసలు పాలయ్యారని, పట్టణాలకు తరలిపోయి లంబాడీ బిడ్డ లు ఆటోలు తోటుకుంటూ పడ్డ కష్టాలు కన్నీళ్ళు తెప్పిస్తాయని.. ఆనాటి కష్టాలను గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక రైతులు, పేదల సంక్షేమంతో పాటు పారిశ్రామిక విధానాలను తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం. ప్రజలు కడుతున్న పన్నులను తీసుకుపోయి కేసీఆర్ రైతులకు రైతుబంధు ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకులు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. రైతుబంధు వేస్ట్ అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. జైపాల్యాదవ్ను గెలిపిస్తే రైతు బంధును ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కరెంట్ 24గంటలు అవసరం లేదని పీసీసీ ప్రెసిడెంట్ అంటున్నారు.. మేము అధికారంలో వస్తే 3 గంటలు కరెంటు ఇస్తామని చెబుతున్నారు. కరెంట్ ఎట్ల సరిపోతదయా అంటే 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాని సెలవిస్తున్నాడు ఆ బుద్ధిమంతుడు. కరెంట్ 24 గంటలు ఉండాలంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే చాలా కమిటేడ్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వంపై, నాపై ఒత్తిడి తీసుకువచ్చి కల్వకుర్తి నియోజకవర్గానికి 90 వేల ఎకరాలకు సాగునీరు పారేలా చేసుకున్నాడు.
50 ఏండ్ల పరిపాలనలో కష్టాలకు గురిచేసిన కాంగ్రెస్ రూ.200 పింఛన్ మన మొఖాన కొట్టింది. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది, ఉద్యమం చేస్తే కాల్చి చంపింది. కల్వకుర్తి సమీపం నుంచి రింగ్ రోడ్ వస్తుంది, ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుంది. బట్టి విక్రమార్క చెబుతున్నాడు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేస్తారట. ధరణీ తీసేస్తే మళ్లీ పాత రోజులు వస్తాయి. బ్రోకర్లు పెరుగుతారు. రైతు బంధు నిలిచిపోతుంది. ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తామంటున్న కాంగ్రెస్ ఓటు వేస్తే బతుకులు ఆగమైపోతాయి, పైరవీకారులు పెరుగుతారు, ఆలోచించుకోండి. మీటింగ్ ముగిసిన తర్వాత ఊర్లకు పోయి చర్చ పెట్టుకొండి. జాగ్రతగా ఆలోచించుకుని ఓటు వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను గెలిపిస్తే ఆయన అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆమనగల్లులో రెవెన్యూ డివిజన్, ఏసీపీ, ఎంవీఐ, కల్వకుర్తిలో ఇంజినీరింగ్ కళాశాలతోపాటు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జైపాల్యాదవ్ బీసీ బిడ్డ.. సీట్లు ఇవ్వని చోట ఇవ్వకలేకపోయాం. ఇచ్చిన చోట బీసీ ఐక్యత ప్రదర్శించాలి. బీసీ బిడ్డ జైపాల్యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, బీఆర్ఎస్ నాయకులు బొంతు రామ్మోహన్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వెంకటేశ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం తదితరులు పాల్గొన్నారు.