Tips for Cultivation | వరి కొయ్యలను కాలిస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతోపాటు పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. సారవంతమైన భూమి దెబ్బతింటున్నది. రైతులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వరి కొయ్యల మిగులు అవశేషాలతో సిరులు సంపాదించవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వరి కోత అనంతరం ఉండే గడ్డిని పశువులకు వాడడం లేదా కంపోస్టుగా మార్చుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
పొలంలో కొయ్యలను కాల్చడం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అవగాహన లేమితో పంటకు ఎంతో మేలు చేసే కొయ్యలను భూమిలో కలియదున్నకుండా కాల్చివేసి భవిష్యత్ పంటలను నాశనం చేస్తున్నారని, వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నారని చెబుతున్నారు. కొయ్యలను కాల్చివేసే క్రమంలో భూమి గట్టిపడుతున్నదని, పొలాన్ని కలియదున్నడం వీలుకాదని పేర్కొంటున్నారు. కొయ్యలను కాల్చివేయడంతో భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు నాశనమవుతున్నాయని, దీంతో భూమి గుల్లగా మారే పరిస్థితి ఉందని చెబుతున్నారు. నాట్లు వేసిన వేర్లకు సరిగ్గా పోషకాలు చేరవని, పైరు పెరగదని వివరిస్తున్నారు. రైతులు ఎక్కువగా యూరియాను వినియోగించాల్సి వస్తున్నదని, కానీ దాన్ని స్వీకరించి వేర్లకు అందించే సూక్ష్మజీవులు అప్పటికే అంతరించిపోవడంతో ప్రయోజనం లేకుండా పోతున్నదని పేర్కొంటున్నారు.ఇదే సమయంలో యూరియాను అతిగా వాడడంతో భూమిలోకి చేరి భూగర్భ జలం విషతుల్యమవుతుందని, వాతావరణంలో అనేక మార్పులు కలుగుతాయని చెబుతున్నారు. కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ గాలిలో కలిసి వాతావరణం, జీవకోటిపైన తీవ్ర ప్రభావం చూపుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
పంట కోసిన వెంటనే వరి కొయ్యలను కాల్చకుండా పొలంలోనే కలియదున్నాలి. దీంతో కొయ్యలు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత సేంద్రియ ఎరువుగా మారుతుంది. వరి కొయ్యలను కలియదున్నడం, కుప్ప చేయడంతో నేలల్లో పగుళ్లు రాకపోవడం, తేమ ఆవిరి కావడం తగ్గి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. కొయ్యలను కలియదున్ని వెంటనే కుళ్లిపోయేలా పొటాషియం చల్లితే సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. తదుపరి పంటకు పోషకాలు విపరీతంగా పెరుగుతాయి.