మహబూబ్నగర్, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం ఇలాకా.. నారాయణపేట జిల్లా కోస్గిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. శనివారం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు దుశ్శాసన పర్వం కొనసాగించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పట్టణంలోని శివాజీ చౌరస్తాలో ఇండ్లపైకి బుల్డోజర్లను పంపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దాదాపు ఆరేడు ఇండ్లు, దుకాణాలను కూల గొట్టారు. ఉదయం నిద్రలేవకన్న ముందే బయట కూల్చివేతలు ప్రారంభించారు.. అక్కడికి వెళ్లి పలువురు మా వద్ద కోర్టు స్టే కాపీ ఉందని, కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. అయితే సభ్య సమాజం సిగ్గుపడేలా మహిళ బాతురూంలో ఉండగానే గోడను కూల్చగా.. సిగ్గు పడని నేతలు సమర్థించుకోవడం గమనార్హం.

ప్రజా ప్రతినిధులుగా ఉండి.. రౌడీల్లాగా ప్రవర్తిస్తూ.. విచక్షణ కోల్పోయి మాట్లాడారు. అయితే తాము రోడ్డు విస్తరణ పనులకు, అభివృద్ధికి అడ్డుకామని, కాస్తా సమయం ఇవ్వమని అడిగినా కనికరం లేకుండా.. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తమపై బెదిరింపులకు దిగారంటూ పలువురు ఆవేదన చెందారు. అనంతరం అక్కడే ఉన్న చిరు వ్యాపారుల నిర్మాణాలను కూడా బుల్డోజర్లతో కూల్చివేశారు. కాగా సదరు మహిళ మీడియాతో మాట్లాడుతూ మా భవనం కూల్చొద్దని ఎంత వేడుకన్నా నాయకులు, కౌన్సిలర్లు వినలేదని చెప్పింది. మీరు ఇంట్లో ఉన్నా కూల్చేస్తామంటూ హెచ్చరించారని వాపోయింది. తాను బాత్రూంలో ఉండగానే గోడ కూల్చివేశారని కన్నీటి పర్యంతమైంది. పోలీసులకు, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా వారు అక్కడకు రాలేదన్నారు. అధికార పార్టీ నాయకులు అధికారమే హద్దుగా రెచ్చిపోయి.. కనీసం ప్రజాప్రతినిధులమన్న సోయి లేకుండా వ్యవహరించారని విపక్షాలు ఆరోపించాయి.