మహబూబ్నగర్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్లో శాసనమండలి ఉపఎన్నికల వేడి ప్రారంభమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జి ల్లాలో స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. 2021లో బీఆర్ఎస్కు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం పార్టీ మారడం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి ఆ యన రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు అంతా ఇంకా బీఆర్ఎస్ వైపు ఉండడంతో కాంగ్రెస్కు ఓటమి భయం వెంటాడుతున్నది. నామినేషన్ల ఘట్టం ముగిసే సమయానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరో 14 మంది ఇండిపెండెంట్లు నా మినేషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం పోటీమాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే నెలకొన్నది.
ఇదిలాఉండగా కాం గ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఏకంగా ఓ పారిశ్రామికవేత్తను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టింది. డబ్బులు ఇచ్చి స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు జిల్లాలు వేరుపడడంతో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లాలో ఉన్న మండలాల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. మొత్తం ఉపఎన్నికల్లో 1,439మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో ఇద్దరు ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్సీలు, 14మంది ఎమ్మెల్యేలు కూడా ఎక్స్ అఫీషి యో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా స్థానిక ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ ఎరవేసినా ఎవరూ ఆ పార్టీ వైపు వెళ్లే పరిస్థితి లేదని గులాబీ దళం ధీమాతో ఉన్నది. గతంలో జెడ్పీ వైస్చైర్మన్గా పని చేసిన నవీన్కుమార్రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఫాం కూడా అందజేశారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వెంటరాగా నవీన్కుమార్రెడ్డి నామినేషన్ దాఖలు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సవాల్ చేశారు. ఈ ఎన్నికల్లో తన విజయం ఖాయమని స్థానిక ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టినా వినే పరిస్థితి లేదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీ, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మహబూబ్నగర్ శాసనమండలి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ స్థానిక సంస్థల్లో ఇంకా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కొనసాగుతున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ తమ పార్టీ నేతలు ఎవరూ కాంగ్రెస్లోకి పోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో డబ్బులతో గెలిచేందుకు పావులు కదుపుతుందని, అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక చెంపపెట్టు లాగా మారబోతున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల త ర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలిచి కేసీఆర్కు బహుమతిగా ఇస్తామన్నారు. కొంతమంది వెన్నుపోటు దారులు పార్టీకి నష్టం చేసినా కిందిస్థాయి కార్యకర్తలు ఇంకా పార్టీని నమ్ముకొని ఉన్నారని.. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపుతో నైతిక మద్దతు ఇస్తుందన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉండి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ లేని కారణంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా శాసనమండలి ఎన్నికల నుంచి బీజేపీ అవుట్ అయింది. లోపాయికారిగా తమ చేతిలో ఉన్న కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులను కాంగ్రెస్కు ఓటు వేయాలని సూచించిన ట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఒక అవగాహన కొచ్చినట్లు కనిపిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూ డా చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ నేతలు కాం గ్రెస్కు బాహటంగా మద్దతిచ్చారు. ప్రస్తుతం ఎంపీ టికెట్ ఆశిస్తున్న డీకే అరుణ అనుచరులు సై తం చాలామంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. మరోవైపు మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జితేందర్రెడ్డి వర్గం కూడా కాంగ్రెస్కు ఓటేయమని.. బీజేపీ ఓటమి ఖాయమని ప్రచారం చే సుకున్నారు. ఇటీవల మహబూబ్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దింపారు. దీంతో కాం గ్రెస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందం బట్టబయలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీనుంచి త ప్పుకొని పరోక్షంగా కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నది. మహబూబ్నగర్ జిల్లాలో పట్టున్న బీజేపీ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓటమిపా లు కావడం.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చెప్పుకోద గ్గ ఓట్లు రాలేదు. బీజేపీ నేతలంతా కాంగ్రెస్కు అ నుకూలంగా ఉండడమే ఇందుకు కారణమని ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు బాహాటంగా ఆరోపిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు జిల్లా లు మారాక రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని కొ న్ని మండలాలను కలిపి శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1,439 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడంతో వచ్చిన తొలి ఎన్నిక కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎ మ్మెల్యేల భుజస్కందాలపై వేసింది. కాగా ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు ఇంకా బీఆర్ఎస్ వైపు ఉండడంతో గులాబీ విజయం ఖాయంగా కనిపిస్తున్నది. యువకుడు ఉత్సాహవంతుడైన మాజీ జెడ్పీ వైస్చైర్మన్, షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన నవీన్కుమార్రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిపింది. దీంతో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యత ను ఎంపీ, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఉం చారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు మున్సిపాలిటీలు మరో రెండు ఎంపీపీ స్థానాలు అధికార పార్టీ కైవసం చేసుకుంది. మిగతా చోట్ల కూడా స్థానిక ప్రజాప్రతినిధులకు ఎరవేసేందుకు ప్రయత్నించినా వారి ప్రయత్నం ఫలించలేదు. మె జారిటీ స్థానిక ప్రజాప్రతినిధులు గులాబీ దళం వైపే ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు పావులు కదుపుతోంది. ప్రస్తుతం కొంతమంది పార్టీ మారినా దా దాపు 900పైచిలుకు స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 720 మంది మద్దతు ఉంటే చాలు. ఈ లెక్కన బీఆర్ఎస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.