నారాయణపేటరూరల్, అక్టోబర్ 28 : నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంతో డెవలప్మెంట్ చేశానని, ప్రజలు ఆలోచించి మరోసారి అభివృద్ధికి పట్టం కట్టాలని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కోరారు. మండలంలోని అంత్వార్, అయ్యవారిపల్లి, లక్ష్మీపూర్, బోయిన్పల్లి, శేర్నపల్లి, శాసన్పల్లి గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతులకు కేవలం మూడు గంటల కరెంట్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెబుతున్నారని, దీన్ని బట్టి చూస్తే వారికి సాగుపై ఏ మేరకు అవగాహన ఉందో అర్థమవుతుందన్నారు. కర్ణాటకలో మనవద్ద ఉన్న ఒక్క పథకం కూడా లేదని.. ప్రజలు కాంగ్రెస్కు అధికారమిస్తే మొండిచెయ్యి చూ పిస్తుందని మండిపడ్డారు. మరి అలాంటప్పుడు మన వద్ద గెలిస్తే ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామంటే ఎలా నమ్ముదామన్నారు. పీఆర్ఎల్ఐ సాగునీరు అందించి రైతుల పాదాలు కడుగుతామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్ కావాలా.. పూటకొక సీఎం మారే కాంగ్రెస్ కావాలా అనే విషయాన్ని ఆలోచించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, జెడ్పీ కో ఆప్షన్ తాజుద్దీన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీకాంత్, మాజీ జెడ్పీటీసీ పుష్పలత, రైతు బంధు సమితి జిల్లా స భ్యుడు జగన్మోహన్రెడ్డి, మైనార్టీ సంఘం మండలాధ్యక్షుడు అలిశేర్, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, నాయకులు ఉన్నారు.