అలంపూర్, మార్చి 24 : రాష్ట్రంలో నెలకొన్న వంటగ్యాస్ కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని గన్ పార్కు వద్ద వంట గ్యాస్ సిలిండర్ల చిత్ర పటాలతో నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ర్యాలీగా అసెంబ్లీకి బయలు దేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ ఒక వైపు కేంద్ర ప్రభుత్వం, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం వంట గ్యాస్ సరఫరాపై ప్రజలతో దోబూచులాడుతున్నాయని మండి పడ్డారు.
పండుగ పూట కూడా ప్రజలను పస్తులుండే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇప్పటికే ఇండ్లల్లో వంట గ్యాస్లేక ఉపవాసాలు ఉండే పరిస్థితి ఉందన్నారు. ఇక హోటళ్లు, చిరు వ్యాపారాలు గ్యాస్ కొరతతో మూతబడ్డాయన్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద ఎక్కడ చూసినా ప్రజలు సిలిండర్లతో బారులు తీరిన దృశ్యాలు కనబడుతున్నాయన్నారు. హోటళ్లు, వ్యాపార సంస్థలపై ఆధారపడి పని చేసే లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి కరువై ఆందోళనతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభంపై స్పందించి ప్రజలకు వాస్తవాలు తెలియజేసి గ్యాస్ సరఫరాను మెరుగు పర్చాలని డిమా ండ్ చేశారు.