మల్దకల్, డిసెంబర్ 3: గద్వాల నియోజకవర్గంలో బండ్ల కృష్ణమోహన్రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి సరితపై 7వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఆదివారం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ మొదలు పెట్టినప్పుటి నుంచి ప్రతి రౌండ్లో బీకేఎంఆర్ ఆధిక్యత కనబరుస్తూ గెలుపొందారు. దీంతో మల్దకల్ మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులు డ్యాన్సులు చేసి పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు. అలాగే గ్రామాల్లో వీధుల్లో కూడా బైక్లపై ర్యాలీ నిర్వహించి ముఖ్యకూడళ్ల వద్ద పటాకులు కాలుస్తూ జై కేసీఆర్, జై బండ్ల కృష్ణమోహన్రెడ్డి అంటు నినాదాలు చేశారు. మల్దకల్ మండల కేంద్రంతోపాటు తాటికుంట, బిజ్వారం, పాలవాయి, మద్దెలబండ, అమరవాయి, పెద్దొడ్డి తదితర గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు బైక్లపై ర్యాలీ తీశారు.
గద్వాల అర్బన్, డిసెంబర్ 3: సాధారణ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ కొనసాగింది. అందులో భాగంగా గద్వాల మండలంలోని గోనుపాడు సమీపంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఈ క్రమంలో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్రెడ్డి గెలుపుతో కౌంటింగ్ కేంద్రంలో ఉన్న ధరూర్ వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, బీఆర్ఎస్ యువనాయకులు సత్వారం రఘునాథ్రెడ్డి, చిట్టెం పురుషోత్తంరెడ్డి, మార్లబీడు రాఘవేంద్ర, నాయకులు ప్రభాకర్గౌడ్, విజయ్భాస్కర్రెడ్డి, కృష్ణ, రాంగోపాల్, వెంకటేశ్వర్రెడ్డి తదితరులు విజయం సింబల్ చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
మల్దకల్, డిసెంబర్ 3: శాసనసభ ఎన్నికలలో గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి రెండోసారి గెలవడంపై మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పటాకులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. మండల కేంద్రంలోని ఆదిశిలాక్షేత్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 101 కొబ్బరి కాయులు కొట్టి తమ మొక్కును చెల్లించుకున్నారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు.
ధరూరు, డిసెంబర్ 3: గద్వాల కోటపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గులాబీ జెండాను ఎగురవేశారు. సమీప ప్రత్యర్థి సరితపై 7,681 ఓట్ల మెజార్టీతో విజయ దుందుభీ మోగించి బీఆర్ఎస్ జెండాను రెపరెపలాడించారు. మొదటి రౌండ్లో ధరూరు మండలంలోని పాగుంట ఆలయ కమిటీ చైర్మన్ నాగర్దొడ్డి వెంకట్రామిరెడ్డి నెట్టెంపాడు కౌంటింగ్ ప్రారంభించగా 350 ఓట్ల ఆధిక్యం అందించి విజయ దుందుభీని మోగించింది. మండల కేంద్రంలో గులాబీనేతలు శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు సంబురాలు చేసుకున్నారు. వైఎస్సార్ చౌరస్తా మొత్తం గులాబీ జెండాలు, డీజే డ్యాన్సులతో హోరెత్తింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రామన్న, మల్లికార్జున్రెడ్డ్డి, దేవరాజు, ఎర్రన్న, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గట్టు, డిసెంబర్ 3: గద్వాల బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్రెడ్డి గెలుపుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొద్ది రౌండ్లు మినహా ప్రతి రౌండ్లోనూ బీఆర్ఎస్ లీడ్ సాధించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. విజయోత్సవ ర్యాలీలకు ఎన్నికల కోడ్ అడ్డురావడంతో శ్రేణులు తామున్న చోటే ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బలిగేరలో కృష్ణమోహన్రెడ్డి గెలుపు సాధించాలని పార్టీ శ్రేణులు దిగంబరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.