జడ్చర్ల టౌన్, మే 20 : పట్టపగలు ఉన్మాదులు కత్తులు పట్టుకొని తిరుగుతుంటే పోలీస్ వ్యవస్థ పట్టించుకోని పరిస్థితి ఉందని, పాలమూరు బిడ్డగా చెప్పుకునే సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలోనే ఆడబిడ్డల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ప్రేమోన్మాది చేతిలో వైష్ణవి దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బుధవారం బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. వైష్ణవి తల్లిదండ్రులు రామచందర్, శ్రీలతలను ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనర్ బాలికపై అఘాయిత్యం ఘటన నుంచి కోలుకోకముందే జడ్చర్లలో ప్రేమోన్మాది చేతిలో వైష్ణవి హత్యకు గురికావడం చాలా బాధకరమన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో అమ్మాయిల రక్షణ కోసం ప్రత్యేక షీటీంలు, డకాయి టీంలు తిరిగేవని, రూ.700కోట్లతో పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులను తీసుకొచ్చారన్నారు.
నేరాలు అరికట్టేందుకు రూ.10లక్షల సీసీ కెమెరాలు పెట్టించి గట్టీ నిఘా పెట్టారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలోనే ప్రజలకు నిజమైన రక్షణ ఉండేదన్నారు. ఇవాళ రాష్ట్రంలో పోక్సో బాధితులకు రక్షణ లేని పరిస్థితి నెలకొందని, మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. మైనర్బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు కేవలం కేంద్ర మంత్రి కొడుకు అయినందుకే 9రోజులపాటు పోలీసులు పట్టుకోకుండా ఆగారని విమర్శించారు. తన బిడ్డపై లైంగిక దాడి జరిగిందని ఓ తల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేయకుండా, కరీంనగర్లో నిందితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలిక, బండి భగీరథ్ బావమరదళ్లుగా తిరిగారని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు, మరోవైపు నిందితుడి తండ్రిపై నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి సానుభూతి తెలియజేస్తుండటం చూస్తే సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ను కాంగ్రెస్, బీజేపీ నాయకులు చదువుతున్నారని విమర్శించారు.
ఎంపీ మల్లురవి సిగ్గులేకుండా నిందితులను వెనకేసుకొచ్చే మాటలు మాట్లాడుతున్నాడని, అందుకే నాగర్కర్నూల్ ప్రజలు నిన్ను ఎంపీగా గెలిపించారా అని ఫైర్ అయ్యారు. ఉన్మాదులకు సపోర్టుగా మాట్లాడే వారికి తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు. అమ్మాయిదే తప్పు అంటూ తప్పుడు ఫొటోలను సోషల్మీడియాలో వైరల్ అవుతుంటే సృ్మతిఇరానీ, నిర్మలాసీతారామన్, మీనాక్షిలేఖి, డీ.కే.అరుణ, మాధవిలత, రచనారెడ్డి, బంగారు శ్రుతి వంటి మహిళా నాయకురాళ్లు ఎక్కడపోయారని ప్రశ్నించారు. రోజుకు 18గంటలు రివ్యూ చేస్తున్నానని చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి కేవలం భూముల దందాల గురించి మాత్రమే రివ్యూ చేస్తున్నాడని, పేదలు, మైనర్ బాలికలు, మహిళల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం సీఎం ఏ మాత్రం కష్టపడటంలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి నిజంగా రివ్యూ చేస్తే ఇప్పటికే ఇద్దరు కమిషనర్లు సస్పెండ్ కావాలన్నారు. కేవలం తన ఆస్తుల చుట్టూ పోలీస్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు సిగ్గుచేటని, అబ్కిబార్ మోదీ సర్కార్ కాదు.. అబ్కి బార్ హాత్యాచార్ సర్కార్ అని తేవాలన్నట్లుగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలని..అంత వరకు తెలంగాణ సమాజం ఊరుకోదన్నారు. తెలంగాణ ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ రావాలని ఎదురుచూస్తున్నారని, మళ్లీ కేసీఆర్ వస్తే మన ధన, మాన,ప్రాణాలకు రక్షణ వస్తదని అమ్మలు, అక్కలు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.