అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం నామపత్రాలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా సెగ్మెంట్లలో భారీగా దాఖలు కావడంతో జాతరను తలపించాయి. చివరి రోజు 12 నియోజకవర్గాల నుంచి 237 నామినేషన్లు అందాయి. అచ్చంపేట, నాగర్కర్నూల్, కొల్లాపూర్, గద్వాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి వేశారు. వారి సెంటిమెంట్ను కొనసాగిస్తూ వివిధ ఆలయాల్లో పూజలు చేశారు. దీంతో నియోజకవర్గ కేంద్రాల్లో గులాబీ జోష్ నెలకొన్నది. అభ్యర్థుల అభిమానులు, పార్టీశ్రేణులు భారీ ర్యాలీ చేపట్టడంతో జనప్రవాహాన్ని తలపించాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలకు రెబల్స్ బెడద తప్పడం లేదు. ఇప్పటి వరకు నామినేషన్లు వేసిన వారిలో స్వతంత్రులే అధికంగా ఉన్నారు.
మహబూబ్నగర్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగిసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 237మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు ఏకంగా 156 నామినేషన్లు దాఖలు చేశారు. అచ్చంపేట, నాగర్కర్నూల్, కొల్లాపూర్ గద్వాల బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ర్యాలీలతో నామినేషన్లు దాఖలు చేశారు. వేలాదిమంది రావడంతో ఆయా నియెజకవర్గ కేంద్రాలు కిక్కిరిసి పోయాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ప్రలోభాలకు తెర లేచింది. కాంగ్రెస్, బీజేపీల్లో టికెట్లు రాని వారంతా రెబల్గా నామినేషన్లు దాఖలు చేయడంతో వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. బీఆర్ఎస్ ముందుగానే టికెట్లు ప్రకటించి బీఫాంలు ఇచ్చి ఎక్కడ అసమ్మతి లేకుండా సిట్టింగ్లకే టికెట్లు కేటాయించింది. ఒక్క అలంపూర్లో ఎమ్మెల్సీ కోరడంతో అభ్యర్థిని మార్చారు. అయితే అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. దీంతో ఎక్కడ అసమ్మతి లేకుండా చేసింది. కాగా మహబూబ్నగర్, దేవరకద్ర నియెజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లకు పోలిన వారితో కాంగ్రెస్ నామినేషన్లు దాఖలు చేయించినట్లు తెలుస్తుంది. మహబూబ్నగర్లో విరసనోళ్ల శ్రీనివాస్గౌడ్, దేవరకద్రలో ఏ వెంకటేశ్వర్రెడ్డి పేరుతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి కుట్రకు తెరలేపారు. బీఆర్ఎస్ దాటికి బయపడి ఈ పనిచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 12 నియెజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 237మంది నామినేషన్లు దాఖలు చేశారు. దాదాపు 340కు పైగా సెట్లను ఆయా రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. నామినేషన్లలో పోరపాట్లు జరిగినా మిగితా సెట్లతో నామినేషన్ వ్యాలిడ్ అవుతుందనే ఉద్దేశంతో అభ్యర్థులంతా రెండు, మూడు సెట్లు దాఖలు చేశారు. కల్వకుర్తిలో 28, మక్తల్ 15, మహబూబ్నగర్ 22, గద్వాల 25, జడ్చర్ల 20, అలంపూర్ 16, దేవరకద్ర 16, వనపర్తి 15, కొల్లాపూర్ 21, అచ్చంపేట 19, నారాయణపేటలో 10, నాగర్కర్నూల్లో 30మంది నామినేషన్లు వేశారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీల్లో టికెట్లు ఆశించి రాని వాళ్లు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. చాలా నియెజకవర్గాల్లో రెబల్స్గా అభ్యర్థులుగా పోటీలో ఉంటామని ప్రకటించారు. దీంతో ఆయా పార్టీల నేతలు వారిని ప్రలోభ పెట్టేపనిలో పడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు అసమ్మతి తగలకుండా చేసుకునేందుకు భారీ ఎత్తున ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తుంది. కాగా వీళ్లు పోటీలో ఉంటే ఓట్లు చీలీ ఓడిపోయే ప్రమాదం ఉందని భావించి బుజ్జగించే పనిలో పడ్డారు. మరికొంతమంది టికెట్లు ఆశించి భంగపడి వేరే పార్టీల్లో టికెట్లు తెచ్చుకొని తమ సత్తా చాటుతామని ప్రకటించి నామినేషన్లు వేశారు. కాగా కొన్నిచోట్ల చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.
మహబూబ్నగర్ జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను పోలిన వారితో నామినేషన్లు వేయించి కుట్రలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి అసంతృప్తులు మూట గట్టుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు తాజాగా కుట్రకు తెరలేపారు. మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్కు పోటీకి రాలేమని తెలిసి బీజేపీ నుంచి వచ్చిన వారికి ఆగమేఘాలమీద టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టారు. దీంతో చాలామంది కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తు పార్టీ మారారు. మరికొంతమంది ఇతర పార్టీల్లో వెళ్లి టికెట్లు తెచ్చుకున్నారు. కాగా మహబూబ్నగర్లో బీసీల్లో పలుకుబడి ఉన్న మాజీ మంత్రి పీ చంద్రశేఖర్, మైనార్టీల్లో మంచి పట్టుఉన్న ఇబ్రహీం బీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. ఇక దేవరకద్రలో కూడా టికెట్లు రాకపోవడంతో బీసీ నేత ప్రదీప్గౌడ్ ముఖ్యమంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఓటమి పాలవుతామని చెప్పి ఓటర్లను తికమక పెట్టడానికి అదే పేరున్న క్యాండెట్లను పెట్టడంతో బీఆర్ఎస్ నేతలు వారి కుట్రలను బయటపెడ్తామని ఓటర్లకు నిజాలు వివరిస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు ఓటమిని జీర్ణించుకోలేకనే వారికి భారీగా డబ్బులు ఆశచూపి నామినేషన్లు వేయించారని తెలుస్తుంది. మొత్తంపైన నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇండిపెండెంట్లు, రెబల్స్కు గిరాకీ బాగా పెరిగింది.