అలంపూర్ కాంగ్రెస్ కంచుకోటకు బీఆర్ఎస్ బీటలు కొట్టింది. నియోజకవర్గం నుంచి 12 సార్లు హస్తం పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినా వారి హయాంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదు. దీంతో జనం కారును ఆదరించడంతో 2018లో ఈ గడ్డపై గులాబీ జెండా ఎగిరింది. తర్వాత నాలుగున్నరేండ్లుగా అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరుగులు పెట్టాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో విద్య, వైద్యంతోపాటు పల్లె, పట్నాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. తుమ్మిళ్ల ఎత్తిపోతలతో సాగునీరు పారింది. అనతి కాలంలోనే అభివృద్ధికి పునాదులు వేస్తూ మెరుగైన పాలన అందించింది. తెలంగాణ ప్రభుత్వం పాలన బాగుందని సీఎం కేసీఆర్ సాహో అంటూ జనం బీఆర్ఎస్కే జై కొడుతున్నారు. చేసిన అభివృద్ధే మళ్లీ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ పార్టీకి అనుకూలించి ఏకపక్ష తీర్పు ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అలంపూర్, నవంబర్ 1: అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న అలంపూర్ను గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చాక రూపురేఖలు మారిపోయాయి. తక్కువ కాలంలో ఊహించని అభివృద్ధి చేపట్టి ప్రజలకు ఏండ్లుగా నెలకొన్న సమస్యలను పరిష్కారం చేసింది. తాగు, సాగునీటితో పాటు విద్యా, వైద్యం, పల్లె, పట్టణాల్లో అభివృద్ధి పరుగులు పెట్టింది. అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కంచుకోటగా ఉన్న అలంపూర్ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. గతంలో ఏ పార్టీ ఎమ్మెల్యేకు ఇవ్వని మెజార్టీ ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థికి ఇచ్చి గత రికార్డులను బద్దలుకొట్టారు. 1952లో అలంపూర్ నియోజకవర్గం ఏర్పడింది. 11 పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థి, ఒకసారి జనతాపార్టీ అభ్యర్థి, రెండుసార్లు టీడీపీ, మూడుసార్లు బీజేపీ, ఒకసారి స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018 ఎన్నికల నుంచి అలంపూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారే ఉన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ వీఎం అబ్రహం కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సంపత్కుమార్పై 44వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
అలంపూర్ నియోజకవర్గాన్ని దాదాపుగా అరశతాబ్దం పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా ఉన్నది. అలంపూర్ నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో మొదటి నుంచి అభివృద్ధిపరంగా వెనుకబడింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధికి పునాదులు పడ్డాయి. 2018లో తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన సందర్భంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పదవిలో ఉండటంతో అభివృద్ధి పరుగులు తీసింది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. మున్సిపాలిటీల్లో అభివృద్ధ్ది పనులకు కోట్లలో (ఒక్కో మున్సిపాలిటీకి రూ.35 కోట్లు) నిధులు మంజూరయ్యాయి. పట్టణ ప్రగతి, పల్లెప్రగతితో గ్రామాలు, పట్టణాలు ఊహించని విధంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లాయి. అభివృద్ధిలో రాష్ట, కేంద్ర స్థాయిలో అవార్డులు కూడా పలు గ్రామాలకు వచ్చాయి. పల్లెప్రగతిలో భాగంగా ఇంటింటికీ కుళాయిలు, పల్లెప్రకృతి వనాలు, డ్రెయినేజీలు, నర్సరీలు, వైకుంఠధామాలు, సీసీరోడ్లు, డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, పంట కల్లాలు, పంచాయతీలకు కొత్త భవన నిర్మాణాలు, రైతువేదికలు తదితర కార్యక్రమాలు చేపట్టడంతో గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. పట్టణాల్లో సెంట్రల్ లైటింగ్ కం డివైడర్, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పించారు. నియోజకవర్గంలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు వంద పడకల దవాఖాన, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు.
చివరి ఆయకట్టుకు సాగునీరందించే ప్రయత్నంలో రూ.786 కోట్లతో తుంగభద్రా నదిపై తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు పూర్తయ్యాయి. 2018 ఎన్నికల ముందే సాగునీరందించింది. రెండో దశ పనులకు పరిపాలన అనుమతులు వచ్చాయి. రెండో దశ పనులు పూర్తయితే అలంపూర్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు పుష్కలంగా సాగునీరందుతుంది. రెండు రాష్ర్టాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యం కోసం నాగల్దిన్నె-పులికల్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణం, అలంపూర్ క్షేత్రం నుంచి శ్రీశైలం క్షేత్రానికి వెళ్లేందుకు, అలంపూర్ మండలంలోని నది ఆవలి గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు అలంపూరు – ర్యాలంపాడు గ్రామాల మధ్య రూ.35కోట్లతో వంతెన నిర్మాణం చేపట్టడం జరిగింది. కర్ణాటక నుంచి తెలంగాణ వరకు రెండు వరుసల రహదారి ఏర్పాటు, ఇటీవలి కాలంలో ఎర్రవల్లి మండలంలో విజయవర్ధిని ఆయిల్ మిల్ అభివృద్ధి పనులకు మంత్రి నిరంజన్రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వాలు చేయనంతగా సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి చేపట్టడంతో ప్రజలంతా గులాబీ పార్టీకి జై కొడుతున్నారు.
అలంపూర్లో గతంలో ఏ పార్టీ చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ పదేండ్లలోనే చేసింది. విద్యా, వైద్యం, పల్లె, పట్టణాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ప్రతి మండలానికి కస్తూర్బాగాంధీ, ప్రభుత్వ కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానాలు, సబ్ సెంటర్లు, రహదారులు, ప్రతి కాలనీలో సీసీ రోడ్లు నిర్మించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతలతో సాగునీరు, వంద పడకల దవాఖానతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టి అలంపూర్ అభివృద్ధి పరుగులు పెడుతున్నది. దీంతో ప్రజలంతా బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్కే మా ఓటు అంటూ స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు.