వనపర్తి, ఆగస్టు 19 : సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని, ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ఉద్యోగులను కడుపున పెట్టుకొని చూసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఇందు గార్డెన్లో ఏర్పాటు చేసిన వీఆర్ఏల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ స్వామ్య వ్యవస్థలో ఉన్న గ్రామ సేవకులు అనే అభ్యంతకర పదాన్ని తొలగించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎల్ఆర్యూపీ ద్వారా ఏ డాదిపాటు రాష్ట్రంలోని భూరికార్డులను శుద్ధి చేసి రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసిన తర్వాత గ్రామ సేవలకులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వివిధ శాఖలకు కేటాయించామని మంత్రి వివరించారు. దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఎన్ని అడ్డంకులు వచ్చినా వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నియామక పత్రాలు అందించారన్నారు.
ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఉత్తర్వులు అందజేసే సమయంలో కుటుంబ సభ్యులతోపాటు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిద్దామని తాను సూచించానని, చెప్పిన ప్రకారం ఇవాళ అందరితో కలిసి సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నో ఉద్యమాలు, అవమానాలు, బాధలు అనుభవించి తె లంగాణ సాధించుకున్నామన్నారు. సాధించిన రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ ముందుచూపుతో అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిపారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 23వేల మంది వీఆర్ఏలను సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారన్నారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు అత్యధిక జీతాలు అందుకుంటున్నది తెలంగాణలోనేనని, ఉద్యోగులతోపాటు ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుంటున్నామని మంత్రి వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మధుసూదన్రెడ్డి, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం పథకాలను చూసి పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో చికెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 300 మంది, వైఎస్సార్టీపీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి సతీశ్కుమార్తోపాటు 50మంది యువకులు మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు వీరికి మంత్రి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే రేవల్లి మండలంలోని నాగపూర్కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో నాగపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లయ్య, నాయకులు వెంకటేశ్, మల్లేశ్ తదితరులు ఉన్నారు.