అలంపూర్/అయిజ ఫిబ్రవరి 27 : ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క మున్సిపల్ సీటు కూడా దక్కించుకోలేక గల్లంతైందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో అయిజ, అలంపూర్ మున్సిపాలిటీల్లో విజయఢంకా మోగించిన మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లను కేటీఆర్ శుక్రవారం ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలో ఏ ఎన్నికలు వచ్చిన, ఎప్పుడు వచ్చిన చల్లా వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో విజయం బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలు అధికార పార్టీపై నమ్మకం లేక, బీఆర్ఎస్ నాయకులపై విశ్వాసంతో విజయాన్ని అందిస్తూ వస్త్తున్నారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అయిజ, అలంపూర్ రెండు మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగురవేసిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందన్నారు.

నాగర్కర్నూల్ జిల్లాలో రెండు నెలల పసిపాప మరణ ఘటన, కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్ డెత్ వంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెద్దుల్లా ముందుకు సాగాయని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి అరాచకాలు జోడెద్దులా మారాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదని రైతు బంధు, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో రైతులను తీవ్రంగా నిరాశకు గురిచేసిందన్నారు. ప్రజలకు కాంగ్రెస్ నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే అర్థమతుందన్నారు.
నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం వ్యాపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ చల్లా ప్రజల సమస్యలపై అంకితభావంతో పనిచేసి నిస్వార్థ నాయకుడని ప్రశంసించారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే విజయు డు కూడా అదే తత్వాన్ని కొనసాగిస్తున్నారన్నారు. కుతంత్రాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేయొచ్చని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాబోయే రోజులు బీఆర్ఎస్వేనని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్లు పిండి జయరాముడు, సీఎం సురేశ్, వైస్ చైర్మన్లు విక్రం, నర్సింహులు, కౌన్సిలర్లు మోహన్రెడ్డి, మాధురి, ఆసీఫ్ ఖాన్, తిరుమల్లేశ్, శివ, రజాక్, జ్యోతి, మహేశ్వరి, సరోజ, శారద సువర్ణ, కృష్ణ, పద్మ, నర్సమ్మ, మహేశ్వరమ్మ తదితరులను కేటీఆర్ సన్మానించారు. అలంపూర్ నియోజకవర్గం నుంచి పెద్దమొత్తంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల ఇన్చార్జి వావిలాల రంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్రెడ్డి, వేమారెడ్డి, నాగన్న గౌడ్, వెంకట్రాములు, పల్లయ్య తదితరులు పాల్గొన్నారు.