నాగర్కర్నూల్, ఫిబ్రవరి 7 : అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి అభివృద్ధిని మరిచి అరాచకాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. శనివారం నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల, నాగనూలు గ్రామాల్లోని 1, 4, 5, 11, 12 వార్డుల్లో ముమ్మరం ప్రచా రం చేపట్టారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అర్జునయ్య, జయలక్ష్మి, పుట్ట యాదమ్మ, వెంకట్రాములు, సుమలత, జయలక్ష్మి తరఫున ప్రచారం సాగించారు. బీఆర్ఎస్ హయాంలోనే నాగర్కర్నూల్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని, ఈ ఎన్నికల్లోనూ మరోసారి బీఆర్ఎస్ జెండాను ఎగరేస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి పర్చుకునే అవకాశం ఉంటుందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటువేసి గెలిపిస్తే నన్ను గెలిపించినట్లుగానే భావిస్తానన్నారు. మీకు అందుబాటులో ఉండే వారిని గెలిపించుకుంటే ఏ సమస్యలు వచ్చినా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని, అలాకాదని వారు ఇచ్చే డబ్బులకు ఆశపడి మోసపోవద్దన్నారు. కాంగ్రెసోళ్లు ఇంటింటికి వెళ్లి పేర్లు రాసుకొని పింఛన్ ఇస్తానని, ఇల్లు ఇస్తానని మోసం చేస్తున్నారని, వారి మోసపూరిత మాటలు నమ్మవద్దన్నారు. ఒక్కసారి కాంగ్రెస్కు ఓటు వేసినందుకే యూరియాకోసం నానా కష్టాలు పడుతున్నామని రైతులు బోరున విలపిస్తున్నారని, రాత్రి పగలు అని తేడా లేకుండా యూరియాకోసం పడిగాపులు కాస్తున్నారన్నారు. మళ్ళీ అదే పార్టీని నమ్మి ఓట్లేస్తే మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగదన్నారు.
తాను ఎమ్మెల్యే కాకముందు కందనూలు ఎట్లున్నది, ఇప్పుడెట్లుందో మీకు తెలుసునని, జిల్లాగా రూపాంతరం చెందిన తర్వాత కందనూలును అద్దంలా మార్చామన్నారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, ట్యాంక్బండ్ ఏర్పాటు చేసి అందరికీ అహ్లాదాన్ని అందించామన్నారు. దురదృష్టవశాత్తు నమ్మి ఒక్కసారి మోసపోయినందుకే ఇంత గోసపడుతున్నాం మరోసారి మోసపోయి గోసపడొద్దని, మున్సిపాలిటీలో గులాబీ జెండాను ఎగరవేయాలని కోరారు. కార్యక్రమంలో 4వ వార్డు అభ్యర్థి యాదమ్మ, 5వ వార్డు అభ్యర్థి వెంకట్రాములు, బీఆర్ఎస్ నాయకులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పది మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో వారికి మర్రి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.