మహబూబ్నగర్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్లో పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా మొత్తం పోలీసు యంత్రాంగం అక్కడే ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. విపక్ష పార్టీలను ప్రలోభపెట్టినా ఎవరూ లొంగకపోవడంతో అధికార పార్టీ అడ్డదారులతో గెలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని నాలుగు పోలీస్ వాహనాలు బండమీది పల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట ఆగాయి. పోలీసులు దిగి హడావుడి చేస్తూ కార్యాలయం వదిలి వెళ్లిపోవాలని కార్యకర్తలను బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
అయితే ఎన్నికల ప్రచారం ముగిసినందున ఎలాంటి జెండాలు కనపడద్దని చెప్పారు. అయినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిబంధనల ప్రకారం తాము నడుచుకుంటామని చెబుతున్న 50మంది పోలీసుల వరకు రోడ్డుపై హల్చల్ చేయడం కనిపించింది. ఇదిలా ఉండగా కొన్నిరోజుల నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మఫ్టీలో తిరుగుతూ అధికార పార్టీ అభ్యర్థికి సహకరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మూడురోజులుగా జిల్లా కేంద్రంలోని పోలీస్ యంత్రాంగం మొత్తం ఆ డివిజన్పై ప్రత్యేక ఫోకస్ పెట్టడం వెనుక కారణాలు ఏమైన ఉంటాయని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఈ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతాడనే భయంతో పోలీసులను రంగంలో దించి ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి వత్తాసు పలుకుతుందని ఆపార్టీ నేతలు డీజీపీ, ఐజీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బుధవారం జరిగే పోలింగ్ కూడా అనుకూలమైన సిబ్బందిని కేటాయించారని దీనిపై కూడా విచారణ జరిపి సిబ్బందిని మార్చాలని ఆ డివిజన్ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏ పోలింగ్ కేంద్రంలో కూడా అనుకూలమైన సిబ్బందిని వేయకూడదు. కానీ అధికార పార్టీ వత్తిళ్లకు తలొగ్గి కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఈ డివిజన్లో ఎన్నికలు సక్రమంగా జరిగేలా కనిపించడం లేదని అధికార పార్టీ రిగ్గింగ్కు ప్రయత్నిస్తుందని ఎన్నికల సంఘం ప్రత్యేక బందోబస్తుతో పాటు వెబ్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరుతున్నారు. ఇప్పటికే డివిజన్లోని ప్రజలను భయభ్రాంతులను చేసి బీఆర్ఎస్కు ఓటు వేయొద్దని ప్రచారం చేస్తున్నారని, ఎన్ని జిమ్మిక్కులు చేసినా 11వ డివిజన్లో బీఆర్ఎస్ గెలుపులు ఆపలేరని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ డివిజన్లో పోలీసుల ఓవరాక్షన్పై నమస్తే తెలంగాణ ప్రతినిధి పోలీస్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా వారు అందుబాటులో రాలేదు. మొత్తం పైన అధికార పార్టీ ఈ డివిజన్లో గెలిచేందుకు అడ్డదారులను వెతుకుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 11వ వార్డులో బీఆర్ఎస్ బీసీ అభ్యర్థి సుభాష్ గౌడ్ కార్యాలయం వద్ద పోలీసుల అత్యుత్సాహం వెనుక అధికార పార్టీ అగ్రవర్ణ నాయకుల హస్తాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ సోమవారం ప్రకటనలో ఖండించారు. ఓటమి భయంతో కాంగ్రెస్ పెద్దలు పన్నిన కుట్రలో భాగంగానే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని, బీసీలపై ఇటువంటి చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెప్తామన్నారు..