తుంగభద్ర నదిపై కలల వారధి సిద్ధమైంది. అలంపూర్ జోగుళాంబ ఆలయానికి సమీపంలో రూ.37 కోట్లతో, అలాగే అయిజ మండలం నాగులదిన్నె వద్ద రూ.42 కోట్లతో చేపట్టిన హైలెవల్ వంతెనలు రెడీ అయ్యాయి.అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు. దీంతో రెండు నిర్మాణాలు నేడు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. దీంతో తెలంగాణ, ఏపీ ప్రాంతానికి దూరభారం తగ్గడంతోపాటు వాహనదారులకు కష్టాలు తీరనున్నాయి.
మహబూబ్నగర్, జనవరి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలోనే ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ అమ్మవారు.. పక్కనే కనిపిస్తున్న పల్లెలు.. మధ్యలో నది.. ఎండాకాలంలో మాత్రమే దాటే వెసలుబాటు.. నదీపరీవాహక ప్రాంతంలోని తెలుగు రాష్ర్టాల ప్రజలు అమ్మవారిని దర్శించుకోవాలంటే చుట్టూ తిరిగి రావాలి. ఇక్కడి ప్రజలకు ఆ ప్రాంతంలోని వారికి సంబంధాలు ముడిపడినా నది అడ్డంకిగా మారింది. నదిపై బ్రిడ్జిని నిర్మించాలని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల డిమాండ్. ఉమ్మడి రాష్ట్రంలో బ్రిడ్జి నిర్మాణానికి నిర్లక్ష్యం చేశారు. ఏండ్లుగా ఎదురుచూస్తున్న కల తెలంగాణ ఏర్పడ్డాక సాకారమైనది.
ఉమ్మడి రాష్ట్రంలో అలంపూర్ పుణ్యక్షేత్రాన్ని నిర్లక్ష్యం చేస్తే.. స్వరాష్ట్రంలో నిజం చేసి సరిహద్దులను చెరిపేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. కలిసి ఉన్నప్పుడు అడ్డుగా మారిన సరిహద్దులు.. విడిపోయాక హద్దులే లేకుండా చేసినట్లయింది. తుంగభద్ర నదిపై ఇటు అలంపూరు హైలేవల్ బ్రిడ్జి, అటు అయిజలో నాగులదిన్నె హైలెవల్ వంతెన నిర్మాణం పూర్తయింది. అలంపూరు ఎమ్మెల్యే అబ్రహం సీఎం కేసీఆర్కు విన్నవించి బ్రిడ్జిల నిర్మాణాన్ని పూర్తిచేయించారు. రూ.37కోట్లతో జోగుళాంబ క్షేత్రానికి సమీపంలో నిర్మించిన వంతెన వల్ల తెలంగాణ, ఆంధ్రా ప్రాంతానికి రాకపోకలు సులువుగా మారాయి. అదేవిధంగా అయిజ మండలం నాగులదిన్నె బ్రిడ్జిని రూ.42కోట్లతో పూర్తిచేయించడంతో మంత్రాలయం పుణ్యక్షేత్రానికి దూరం తగ్గుతుంది. దీంతో వనపర్తి, నాగర్కర్నూలు, జోగుళాంబగద్వాల జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లేందుకు దూరం తగ్గింది.
అలంపూరు ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇరు రాష్ర్టాల ప్రజలు చుట్టూ తిరిగొచ్చే వారు. అలాగే ఈ ప్రాంత ప్రజలు ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలన్న ఇదే పరిస్థితి. తెలుగు రాష్ర్టాల సరిహద్దులో ఉండే ప్రజల మధ్య సంబంధాలు ఎండాకాలంలోనే కొనసాగేవి. ఎమ్మెల్యే అబ్రహం ఇక్కడి పరిస్థితిని సీఎం కేసీఆర్ను విన్నవించి రూ.37కోట్లతో తుంగభద్రనదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులు ముమ్మరంగా పూర్తికావడంతో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. ఈ వంతెన వల్ల కర్నూలు, చిత్తూరు జిల్లాకు దూరం తగ్గుతుంది. అలాగే అయిజ మండలంలోని నాగులదిన్నె వద్ద తుంగభద్రనదిపై ఉన్న పాతవంతెన వరదల వల్ల కొట్టుకుపోయింది.
ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా పూర్తిచేయాలని ఏండ్ల్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడ్డాక రూ.42కోట్లతో మధ్యలో నిలిచిన నిర్మాణాన్ని పూర్తిచేయించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయానికి 50కిలోమీటర్ల దూరం తగ్గింది. అక్కడి ప్రజలు గద్వాల, అయిజ, హైదరాబాద్కు చుట్టూ తిరిగి వెళ్లకుండా కిలోమీట్లర్ల దూరం తగ్గింది. ఈ రెండు బ్రిడ్జీలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే అబ్రహం అంటున్నారు.
నియోజకవర్గంలో రూ.117.83కోట్లతో 10బ్రిడ్జీలు నిర్మిస్తున్నారు. ఇందులో కొన్ని పూర్తికాగా మరికొన్ని ప్రతిపాదనల్లో ఉన్నాయి. రూ.37కోట్లతో తుంగభద్రనదిపై అలంపూరు వద్ద, అయిజ మండలం నాగులదిన్నె వద్ద రూ.42 కోట్లతో నిర్మిస్తున్న వంతెనలు పూర్తయ్యాయి. రూ.4.59కోట్ల వ్యయంతో కలుకుంట్ల వద్ద వంతెన, రూ.10.69కోట్లతో బొంకూరు వద్ద వంతెన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఎక్లాస్పూర్ వద్ద రూ.5.64కోట్లతో పనులు ప్రగతిలో ఉన్నాయి. అయిజ పట్టణంలో రూ.8కోట్లతో, బైరాపూర్ వద్ద రూ.1.50కోట్లతో నిర్మించనున్న వంతెనకు టెండర్లు పూర్తయ్యాయి. ఆర్ గార్లపాడు వద్ద రూ.2.50కోట్లతో నిర్మిస్తున్న పనులు ప్రగతిలో ఉన్నాయి. సాతర్లలో రూ.2.50కోట్లతో, గుడిదొడ్డిలో రూ.3.50కోట్లతో వంతెన నిర్మాణ పనులకు టెండర్లు పూర్తయ్యాయి.
సీఎం కేసీఆర్ చొరవతోనే అలంపూరు నియో జకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. తెలంగాణ ఏర్పడ్డాక 2018నుంచి నిధులు విడుదల అవుతుండటంతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. తుంగభద్రనదిపై రెండు పెద్ద వంతెనల నిర్మాణమే ఇందుకు నిదర్శనం. జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గం అన్నిరంగాల్లో పోటీ పడుతున్నది. మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభించి పూర్తిచేస్తాం.
– అబ్రహం, ఎమ్యెల్యే, అలంపూరు