చిన్నచింతకుంట, వర్నె-ముత్యాలంపల్లి మధ్య ఊకచెట్టువాగుపై చెక్డ్యాం, బ్రిడ్జి నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.59 కోట్లు విడుదల చేసింది. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ శంకుస్థాపన చేయగా..ఈ పనులు పూర్తయితే 8 నుంచి 12 కిలోమీటర్ల చొప్పున ప్రయాణ దూరం తగ్గనున్నది. జాతీయ రహదారికి నేరుగా కనెక్టివిటీ చేకూరనున్నది. చెక్డ్యాం నిర్మాణంతో అదనంగా 2 వేల ఎకరాలకు సాగునీళ్లు అందనున్నాయి. వాగు పరిసర గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు పెరగనున్నాయి. అలాగే పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి ఆలయం కొండపైకి ఘాట్ రోడ్డు ఏర్పాటు కానున్నది. బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వ్యయప్రయాసాలకోర్చి కొండపైకి చేరుకుంటారు. అందుకే రోడ్డు నిర్మించాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఇక భక్తుల కష్టాలు తీరనుండగా.. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కృషి ఫలించింది.
– మహబూబ్నగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదల తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన కురుమూర్తిరాయ కొండకు భక్తులు ఇక కాలినడకన వెళ్లాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే కొండపైకి ఎక్కేందుకు ఘాట్ రోడ్ నిర్మించాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చేసిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఘాట్ రోడ్తోపాటు చిన్నచింతకుంట, వర్నె-ముత్యాలంపల్లి మధ్య రెండు బ్రిడ్జిలను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.59 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు ఇటీవల ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ రెండు బ్రిడ్జిలు పూర్తయితే ఇటు అడ్డాకుల, అటు కొత్తకోట జాతీయ రహదారికి నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది. సుమారు 10 కిలోమీటర్ల మేర దూరం తగ్గనున్నది. ఏటా కురుమూర్తి స్వామిని దర్శించుకునేందుకు చిన్నచింతకుంట నుంచి ఎడ్ల బండ్లు, బైక్లపై అనేక వ్యయప్రయాసాలకోర్చి వాగు దాటేవారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు వాగుపై బ్రిడ్జి కం చెక్డ్యాం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఊకచెట్టువాగుపై బ్రిడ్జి కం చెక్డ్యాం నిర్మాణంతో సుమారు రెండు వేల ఎకరాలకు సాగునీరందడమే కాకుండా భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉన్నది.
తీరనున్న భక్తుల కష్టాలు..
ఏటా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అయితే, నారాయణపేట, కర్ణాటక ప్రాంతాల భక్తులు చిన్నచింతకుంట మీదుగానే రావాలి. ఉద్దాల మహోత్సవాన్ని లక్షలాది మంది భక్తులు తిలకిస్తారు. ఈ క్రమంలో కురుమూర్తి రాయుడిని దర్శించుకోవాలంటే కాలినడకన కొండ ఎక్కాల్సిందే. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కింది నుంచే దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, తిరుపతి మాదిరిగా కొండపైకి ఘాట్రోడ్ నిర్మిస్తే భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం మరింత చేరువవుతుందన్న ఉద్దేశంతో రహదారి నిర్మించేందుకు ప్రతిపాదన తీసుకొచ్చారు. ఊకచెట్టు వాగుపై బ్రిడ్జి కం చెక్డ్యాం, ఘాట్ రోడ్ నిర్మాణానికి ఓకే చెప్పడంతో భక్తుల కష్టాలు తీరనున్నాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సమయానికి బ్రిడ్జి, ఘాట్ రోడ్ పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎమ్మెల్యే ఆల దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.
స్వామి రుణం తీర్చుకుంటా..
పేదల తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన కురుమూర్తి రాయుడి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు కొండకు వస్తారు. అంతేకాకుండా పండుగలు, పర్వదినాల్లో భక్తుల సంఖ్య వందల్లో ఉంటుంది. స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వచ్చి ఇబ్బందులు పడుతుంటారు. తెలంగాణ వచ్చాక ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. తిరుపతిలాగా కొండపైకి ఘాట్రోడ్ నిర్మించి వాహనాలను అనుమతిస్తే అనేక మంది భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఇది కురుమూర్తి స్వామి రుణం తీర్చుకునే సదావకాశం. బ్రిడ్జి కం చెక్డ్యాం వల్ల రహదారి సౌకర్యం మెరుగుపడడమే కాకుండా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
– ఆల వెంకటేశ్వర్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే
రూ.59 కోట్లు మంజూరు..
ఘాట్ రోడ్, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం రూ.59 కోట్లు మం జూరు చేసింది. ఊకచెట్టువాగుపై చిన్నచింతకుంట మండల కేంద్రానికి సమీపంలో, అడ్డాకుల మండలం వర్నె, ముత్యాలంపల్లి గ్రామా ల మధ్య బ్రిడ్జి కం చెక్డ్యాం పనులు ప్రారంభమయ్యాయి. వర్నె-ముత్యాలంపల్లి బ్రిడ్జి పనులకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, సీసీకుంట బ్రిడ్జి కం చెక్డ్యాం పనులకు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ రెండు వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాగా, చిన్నచింతకుంట, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్లాలంటే చుట్టూ తిరిగి పోవాల్సి వచ్చేది. అయితే ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణంతో ప్రయాణ దూరం తగ్గడమే కాకుండా జాతీయ రహదారికి లింక్ ఏర్పడుతుంది. చిన్నచింతకుంట బ్రిడ్జి పూర్తయితే సుమారు 10 కిలోమీటర్లు, వర్నె-ముత్యాలంపల్లి బ్రిడ్జి పూర్తయితే సుమారు 12 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారుల అంచనా.