నాగర్కర్నూల్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని బొందలపల్లి జిల్లా కేంద్రానికి కేవలం పది కిలో మీటర్ల దూరంలోనే ఉన్నా విసిరేసినట్లుగా మారుమూలన ఉంటుంది. అలాంటి ఈ గ్రామం ప్రస్తుతం అభివృద్ధిలో ఇతర గ్రామాల కంటే ముందంజలో నిలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 11వ తేదీన సంసద్ ఆదర్శ గ్రామ యోజన(సాగీ) పథకంలో భాగంగా ఎంపీ పోతుగంటి రాములు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పల్లె ప్రగతితో పాటుగా 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పల్లె ప్రకృతి వనం, వన నర్సరీ, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డులు పూర్తికాగా వ్యవసాయ కల్లాలు, పశువుల పాకలు, ఇంటింటికీ ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సర్పంచ్ మల్లేపల్లి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో ప్రస్తుతం రూ.కోటి ఖర్చుతో భూగర్భ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 90 శాతం పనులు పూర్తయ్యాయి. శ్రీపురానికి వెళ్లే రోడ్డులో ఎంజీకేఎల్ఐ నీళ్లు చెరువులోకి ప్రవహిస్తుండటంతో బ్రిడ్జి నిర్మించడంతో వానకాలంలో రాకపోకలకు తిప్పలు తప్పాయి. దాదాపు అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. ఇక సమీకృత గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. ఇందులోనే గ్రామ పంచాయతీ కార్యాలయం, పశువైద్యశాల, మహిళా సమాఖ్య భవనం, పల్లె దవాఖాన, సమావేశ మందిరం, అధికారులకు అతిథి గృహం వంటి నిర్మాణాలు ఈ సముదాయంలో ఉండనున్నాయి.
గ్రామంలో మొత్తం ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ ఉచితంగా శుద్ధజలం అందుతున్నది. ఇక బీసీ కమ్యూనిటీ భవనానికి రూ.5 లక్షలు మంజూరయ్యాయి. జాతీయ స్థాయిలో కేంద్రం సర్వే చేపట్టగా పథకంలో భాగంగా ఎంపికైన 700 వరకు పంచాయతీల్లో గ్రామానికి ఈ గ్రామానికి గతేడాది జాతీయ స్థాయిలో రెండో స్థానం దక్కడం విశేషం. గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాల ఆధారంగా ఈ ర్యాంకును కేటాయించారు. వంద మార్కులతో కూడిన సర్వేలో గ్రామంలో పర్యావరణ పరిరక్షణ, గ్రామ సభ నిర్వహణ, జిల్లా స్థాయి సమావేశాలు, మౌలిక వసతుల కల్పన, శాంతిభద్రతలు, వలసలు తగ్గించడం, జీవన ప్రమాణాలతో జీవించడంలాంటి అంశాలను ఇందులో సేకరిస్తారు. ఉమ్మడి జిల్లాలోనే ఈ గ్రామం ఒక్కటే ఇలా ఎంపికై మంచి ర్యాంకును సాధించింది. అలాగే కార్పొరేట్ సర్వీస్ సేవా పథకంలో భాగంగా గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను ఆధునీకరిస్తున్నారు. రెండంతస్థులతో రూ.1.50 కోట్లతో కార్పొరేట్ స్థాయిలో నిర్మిస్తుండటం జరుగుతున్నది. ప్రస్తుతం ఉన్న భవనంలో శిథిలమైన గదులను తొలగించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక గ్రామం నుంచి అవురాసిపల్లి, గుడిపల్లి, తూడుకుర్తి, పెద్దాపూర్ గ్రామాలకు రూ.95 లక్షలతో ఫార్మేషన్ రోడ్లు నిర్మాణం చేపడుతున్నారు. శ్రీపురం నుంచి బొందలపల్లికి బీటీ రోడ్డు వేయనున్నారు. ఇందుకు రూ.1.50కోట్లు మంజూరయ్యాయి. ముఖ్యంగా గ్రామం చుట్టూ సీసీ రోడ్డునూ రింగ్ రోడ్డులా వేయడం మరో విశేషం. ఒక్కసారి ఈ రోడ్డు మీదుగాగ్రామం మొత్తాన్ని చుట్టేసిరావచ్చు. అలాంటి ఈ గ్రామంలో 3 వేలకుపైగా జనాభా, 1800పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం మీద బొందలపల్లి గ్రామం ఇతర గ్రామాలకు అభివృద్ధిలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది.
ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను. ఓ కార్పొరేట్ సంస్థ సహకారంతో రూ.1.50 కోట్లతో గ్రామ పాఠశాలను ఆదర్శంగా నిర్మిస్తున్నాం. సమీకృత పంచాయతీ భవన సముదాయం నిర్మించేందుకు స్థల సేకరణ పూర్తయింది. రూ.కోటితో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఊరి చుట్టూ రింగ్ రోడ్డులా సీసీ రోడ్డును వేయించాం. గ్రామం ఐదు నెలల కిందట ప్రకటించిన సాగీ పథకంలో జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాను.
– శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్, బొందలపల్లి