జడ్చర్ల టౌన్, మార్చి 12 : బీజేపీ అధికారం కోసం అన్ని సంప్రదాయాలను తొంగలో తొక్కి నీచ, నికృష్ట రాజకీయాలకు తెరలేపుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇలాంటి రాజకీయాలు చేయలేదన్నారు. కేవలం అధికారమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఎవరైనా లొంగకపోతే సీబీఐ, ఈడీ కేసులంటూ బెదిరింపులకు పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను మాత్రమే టార్గెట్గా చేసి కేసుల్లో అన్యాయంగా ఇరికిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5వేలకుపైగా నమోదైన ఈడీ కేసుల్లో ఒక్క బీజేపీ నాయకుడు లేడన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకోలేక అధికారులు రాజీనామాలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఇందుకు ఈడీ సంస్థ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీశ్రాణా రాజీనామానే నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చిన అదాని ఉదంతాలు బీజేపీ ప్రభుత్వానికి కన్పించడం లేదా అని ప్రశ్నించారు. ఆయన కోసమే మోదీ విదేశీ పర్యటనలు చేసినట్లుగా ఉందన్నారు. అదానీ, మోదీ ఒక్కరేనన్న విషయం ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారన్న భయంతోనే ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకు ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేశారని విమర్శించారు. ఎలాంటి తప్పు చేయలేదు అందుకే కవిత విచారణకు సహకరించారని తెలిపారు. కానీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేత బీఎల్ సంతోశ్ తప్పు ఉండటంతో విచారణను తప్పించుకునేందుకు కోర్టుకు వెళ్లారన్నారు. జాతీయవాదం, హిందూత్వం పేరుతో ప్రజలను మభ్యపెట్టి దేశాన్ని సర్వనాశనం చేయడమే బీజేపీ పనిగా పెట్టుకున్నదన్నారు. వీరిని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని చెప్పారు. దేశంలో బీజేపీకి బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయం అన్నారు. దేశ్కీ నేత కేసీఆర్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమన్నారు. ఆ పార్టీ నాయకులకు మహిళలంటే గౌరవం లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా నీచ రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు.
అర్హులైన వారికి డబుల్బెడ్రూం ఇండ్లు
అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో అర్హులను గుర్తించి అందజేస్తామని చెప్పారు. దళితబంధు, గృహలక్ష్మి పథకాలు అర్హులకే అందుతాయన్నారు. అవకతవకలు, పైరవీలు ఉండవని తేల్చిచెప్పారు. వేసవి దృష్ట్యా మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా, కొత్త లైన్ల ఏర్పాటు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్, బీఆర్ఎస్ నాయకులు రఘుపతిరెడ్డి, రామ్మోహన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.