పాలమూరు, జూన్ 7 : మహబూబ్నగర్ నైపుణ్య శిక్షణ కేంద్రం ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శాంతానారాయణగౌడ్ ట్రస్ట్, సెయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నైపుణ్య శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు మంత్రి కేటీఆర్ నేడు పాలమూరుకు వస్తున్న నేపథ్యంలో మెట్టుగడ్డ-పిల్లలమర్రి రోడ్డులో ఉన్న ఐటీఐ బాలికల కళాశాల వద్ద ఏర్పాట్లను మంత్రి, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నర్సింహ, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్టుగడ్డలోని బాలికల ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేస్తారన్నారు. మార్చిలో ప్రారంభమైన శిబిరంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కేటీఆర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను పంపిణీ చేసి.. అందరికీ ఉగ్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఐటీఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో హాస్టల్ వసతి కూడా ఉంటుందని, ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మహిళలకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ అవకావాలు కల్పించాలనే ఆలోచన చేసిన సెయింట్ ఫౌండేషన్ నిర్వాహకురాలు ప్రద్యుమ్న, శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీహితను మంత్రి అభినందించారు.
యువజన సంక్షేమశాఖ ద్వారా జిల్లాలో ఇప్పటికే 45 కోర్సులలో యువతకు శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి యువతకు అండగా నిలిచామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, సెయింట్ ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్చార్జి కృషిదీవి, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్చైర్మన్ గణేశ్, కమిషనర్ ప్రదీప్కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.