గద్వాల, ఆగస్టు 4 : అవసరం ఉన్నన్ని రోజులు భూభారతి ఆపరేటర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకున్నది. ఇప్పుడు అవసరం తీరడంతో వారిని తొలగించడానికి సర్కార్ కుట్ర పన్నుతోందని పలువురు బీబీవోలు ఆవేదన చెందుతున్నారు. ముందే గ్రహించిన ఆపరేటర్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 16 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ రెండ్రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. మంగళవారం డిమాండ్లు పరిష్కరించాలని హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. అక్కడ భూపరిపాలన ప్రధాన కమిషనర్ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్)కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే..
జోగుళాంబ గద్వాల జిల్లాలో 13 మండలాలు ఉం డగా అన్ని మండలాల్లోని తాసీల్దార్ కార్యాలయాల్లో భూభారతి ఆపరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ప్రతి నెలా గౌరవ వేతనంగా రూ.21,652 అందజేస్తున్నారు. ప్రభుత్వం 16 నెలలుగా వేతనాలు ఇవ్వకున్నా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే వీరి స్థానంలో ఈ మధ్య కాలంలో గ్రూప్-4కు ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించి వారిని భూ భారపతి ఆపరేటర్లుగా నియమించడానికి ప్రభుత్వం యత్నిస్తున్నదన్న విషయం తెలుసుకొన్నారు.
దీంతో జిల్లా భూ భారతి ఆపరేటర్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సీసీఎల్ఏకు వెళ్లి అక్కడ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. రెండ్రోజులుగా విధులకు హాజరు కాకపోవడంతో తాసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ కోసం రెవెన్యూ కార్యాలయాలకు వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కాగా ప్రస్తుతం పని చేస్తున్న వారికి విధులు నిర్వహించడానికి ఈనెల 6వ తేదీ వరకే అవకాశం ఉన్నట్లు భూభారతి ఆపరేటర్లు తెలిపారు. ఉద్యోగాల నుంచి తొలగించి తమ కడుపు కొట్టవద్దని పలువురు వేడుకుంటున్నారు. భూభారతి ఆపరేటర్లకు సంబంధించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరగా మీ వేతనాలకు సంబంధించిన ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉన్నట్లు చెబుతున్నట్లు ఆపరేటర్లు తెలిపారు.