శ్రీశైలం, మార్చి 5 : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణాలు, రుద్ర, చండీహోమం నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన రావణ వాహనంపై అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు చేశారు. మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో క్షేత్ర వీధుల్లో ఊరేగించారు. కళాకారుల జానపదాలు, ముంబాయి డోలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడోలు, నందికోళ్లసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాలతో ఊరేగింపు కనుల పండువగా కొనసాగింది. అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతోపాటు స్వామి అమ్మవార్లకు ఆస్థానసేవ చేపట్టారు. రావణ వాహనాధీశుడైన స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న వారు కష్టాలనుంచి వీడి సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్బోర్డ్ చైర్మన్ రెడ్డివారిచక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు, ధర్మకర్తలమండలి సభ్యులు విరూపాక్షయ్య, విజయలక్ష్మి, ఈఈలు రామకృష్ణ, నర్సింహారెడ్డి, మురళీధర్రెడ్డి, ఏఈవోలు మోహన్, హరిదాస్, మల్లికార్జునరెడ్డి, స్వాములు, ఫణిధరప్రసాద్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న పాల్గొన్నారు.
శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లకు కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానం నుంచి పట్టువస్ర్తాలు సమర్పించారు. మంగళవారం కాణిపాకం ట్రస్ట్బోర్డ్ చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో వెంకటేశ్, అర్చక వేదపండితులు ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకోగా, శ్రీశైల దేవస్థానం చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రోచ్ఛారణల మధ్య పట్టువస్ర్తాలను తలపై ఉంచుకొని స్వామిఅమ్మవార్లకు సమర్పించారు.
ఆలయ మాడవిధిలోని భ్రామరీ కళావేదికతోపాటు పుష్కరిణి, శివదీక్షా శిబిరాల వద్ద అర్ధరాత్రి వరకు భక్తులు తిలకించేందుకు ఏర్పాటు చేసిన కూచిపూడి, భరతనాట్యం, హరికథ, బుర్రకథ, భక్తరంజని, నాటికలు వంటి కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయని పీఆర్వో తెలిపారు.
మహబూబ్నగర్, మార్చి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం తొలి నామినేషన్ దాఖలైంది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి ఎంపీటీసీ మంగి విజయ్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్కు అందజేశారు.