పెబ్బేరు, జూన్ 26 : కులవృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష సాయంపై లబ్ధిదారులు గంపెడాశలు పెట్టుకున్నారు. కులవృత్తులే జీవనాధారంగా బతుకెళ్లదీస్తున్న వెనుకబడిన తరగతుల వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు పూర్తి సబ్సిడీతో రూ.లక్ష అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పెద్దఎత్తున దరఖాస్తులు పెట్టుకున్నారు. గడువు సమయం సరిపోక చాలామంది నిరాశ చెందినప్పటికీ..జిల్లా వ్యాప్తంగా 11,843మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని, వచ్చేనెల 15న మొదటి విడుతగా సాయం అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దరఖాస్తుల వెల్లువను దృష్టిలో పెట్టుకొని (సీరియల్ నంబర్ ప్రకా రం) లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలను సూచించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది.
సంప్రదాయంగా వస్తున్న కులవృత్తులనే జీవనాధారంగా చేసుకొని బతుకుతున్న ఎందరో పేదల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు. పూర్తి సబ్సిడీతో రూ.లక్ష సాయం అందిస్తూ కులవృత్తులను ప్రోత్సహించడం సంతోషించదగిన విషయం. వెనుకబాటుతనానికి మారుపేరైన వృత్తులకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం చేయూతనిస్తుండటంతో వృత్తిదారులు ఆర్థికంగా బలోపేతం అవుతారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి రుణపడి ఉంటారు.
-ఇటిక్యాల శ్రీకాంత్, రజక సంఘం వనపర్తి జిల్లా నాయకుడు
ఎంపిక చేసిన కులవృత్తుల వారికి రూ.లక్ష సాయం పంపిణీని నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తాం. ఇప్పటికే మా శాఖకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ప్రభుత్వ సూచనల మేరకు ప్రక్రియను పూర్తిచేస్తాం. లబ్ధిదారులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. దళారులను ఆశ్రయించొద్దు. అర్హతలు ఉండి సరైన ధ్రువపత్రాలు ఉన్న వారు ఎంపిక అవుతారు. ఇది నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం ఇప్పటికే పేర్కొన్న విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి.
– అనిల్ప్రకాశ్, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి, వనపర్తి