నాగర్కర్నూల్, ఫిబ్రవరి 24 : నాగర్కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణించిన విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి ప్రతిపాక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యా యి. గత 18వ తేదీన జరిగిన ఘర్షణలో పసికందు తీవ్రంగా గాయపడి 21వ తేదీన మరణిస్తే అప్పటి నుంచి చిన్నారి కుటుంబంపై దాడి చేసిన వారిపై కేసులు చేయకుండా అరెస్టు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, అఖిలపక్షాల ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో న్యాయం కోసం ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేయగా అన్ని పార్టీల నాయకులు బాధిత కుటుంబానికి న్యాయం చేసేంత వరకు పోరాడుతామని, పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపుతూ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
మంగళవారం బీసీ సంఘం జాతీయ నాయకుడు ఆర్.కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, బీఎస్పీ అధ్యక్షుడితోపాటు కమ్యూనిస్టు పార్టీల నాయకులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ముందుగా బీసీ సంఘం జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కుమ్మెర ఘటన క్రూరమైనదన్నారు. దర్శనానికి వెళ్లిన అమ్మాయిని తన్ని తన బిడ్డను పొట్టన పెట్టుకోవడం అనేది అగ్రకుల అహంకారానికి నిదర్శనమన్నారు. క్రూర మృగాలు సైతం ఏదైనా జంతువుపై దాడి చేసేముందు పిల్లలను వదిలేసి పెద్దవాటిపై దాడిచేస్తాయని అంతకంటే హీనంగా, క్రూర జంతువుకంటే హీనంగా కుమ్మెర ఘటన జరగడం దురదృష్ణకరమన్నారు. వారు మనుషులు కాదని, మృగాలని, వారిపై వెంటనే కేసులు బనాయించి బంధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అండ చూసుకొని రాష్ట్రంలో అగ్రవర్ణాల వారు బీసీలపై రెచ్చిపోయి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
అరాచకాలను ఆపకపోతే తమిళనాడులో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం ఎలా జరిగిందో తెలంగాణాలో కూడా ఒక కులానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ఈ సంఘటనపై పోరాడుతున్న విశారదన్ మహరాజ్ పోరాటాన్ని అభినందించారు. ప్రభుత్వం దిగొచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదన్నారు. జరిగిన ఘటనపై స్పందించకుండా నిమ్మకుండా కూసుంటే రేపటి రోజుల్లో అన్ని బీసీ కులాలపై దాడులు జరుగుతాయన్నారు. ప్రజలందరూ ఎక్కడికక్కడ ఈ సంఘటనను ఖండించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, విశారదన్ మహరాజ్లు బాధితుల శిబిరాన్ని సందర్శించి వారిని పరామర్శించారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హోంశాఖను తన చేతుల్లో పెట్టుకొని సొంత జిల్లాలో లాంటి అమానుషమైన ఘటన జరిగినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. నిందితులు తమ పార్టీ వారు అయినందువల్లే చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పాలనపై సీఎం పట్టుకోల్పోతున్నారని విమర్శించారు. జిల్లాకు కూతవేటు దూరంలో ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడం దరదృష్ణకరమన్నారు. ఈ ఘటనకు కారకులైన నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కుమ్మెరలో జరిగిన ఘటనకు నిరసనగా నాగర్కర్నూల్లోని అంబేద్కర్ కూడలిలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన సీపీఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారి కార్యాలయం నుంచి ధర్నా శిబిరాన్ని వచ్చిన వారు వెంట తెచ్చిన దిష్టిబొమ్మను దీక్షా శిబిరం ముందు దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో గమనించిన పోలీసులు దిష్టిబొమ్మను వారి చేతిలో నుంచి లాక్కున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులు సీపీఐ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యక్రమాల్లో ప్రజా సంఘాల, దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ధర్నా శిబిరానికి వివిధ పార్టీల నాయకులు రావడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
నాగర్కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘర్షణలో చిన్నారి మరణానికి కారకులైన వారిలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సంగ్రామ్సింగ్జీ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. చిలుకేశ్వరం చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశామని, వీరిలో ఏ-1 శ్రీనివాస్రెడ్డి, ఏ-2 మధుసూదన్రెడ్డి, ఏ-3 శ్రీకాంత్రెడ్డిని అరెస్టు చేశామన్నారు. మిగతా వారిలో ఏ-4 విష్ణువర్ధన్రెడ్డి, ఏ-5 కన్నిరెడ్డి, ఏ-6 కటిక నరేశ్, ఏ-7 తుకారాంరెడ్డి, ఏ-8 సతీష్రెడ్డి, ఏ-9 మాధవరెడ్డి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.