నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ)/కల్వకుర్తి, అక్టోబర్ 13 ;బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఇక ఊరూరా పాటల సందడి మొదలు కానున్నది. సంప్రదాయబద్ధంగా పట్టుచీరలతో అందంగా ముస్తాబైన తెలంగాణ పడతులు తమకే సొంతమైన బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించుకోనున్నారు. ప్రతి ఏడాది ఆడపడుచులంతా ఆతృతతో ఎదురుచూసే బతుకమ్మ పండుగ శనివారం నుంచి ప్రారంభం అవుతోంది. సమైక్య పాలనలో ప్రాభవం కోల్పోయిన పండుగకు స్వరాష్ట్రంలో గుర్తింపు ఇచ్చిన సర్కారు పల్లెలు, పట్టణాల్లోనూ అధికారికంగా నిర్వహిస్తున్నది. తొమ్మిది రకాల పూలతో చేపట్టే బతుకమ్మలతో ప్రకృతి పండుగగా పిలుచుకొనే తెలంగాణ పండుగ కావడం విశేషం.అయితే ఇప్పటికే విద్యాసంస్థల్లో వేడుకలు షురూ అయ్యాయి. శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులు బతుకమ్మ ఆడారు.
స్త్రీ తత్వానికి ప్రతీక
తెలంగాణ పడతుల పండుగ బతుకమ్మ. సమైక్య రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రాభవం కోల్పోయింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ స్వరాష్ర్టాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పండుగకు తిరిగి గత వైభవం సంతరించుకున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆడపడుచులంతా బతుకమ్మ బోనాలతో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో భాగమయ్యారు. ప్రతి ఉద్యమంలోనూ ఈ పండుగ ప్రత్యేకంగా నిలిచింది. సమైక్య పాలనలో ఈ పండుగ నిరాదరణకు గురి కాగా.. స్వరాష్ట్రంలోసీఎం కేసీఆర్ వల్ల గుర్తింపు వచ్చింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అధికారికంగా ఉత్సవాలు చేపడుతుండటం గమనార్హం. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులందరికీ సర్కారు సారెగా తీరొక్క రంగుల చీరలను పంపిణీ చేస్తున్నది.
బతుకమ్మ అంటేనే స్త్రీ తత్వం. చైతన్యం, యవ్వన సౌరభం దాగి ఉన్నాయి. మాతృస్వామ్య మూలాలున్నాయి. అందుకే ప్రకృతికి స్త్రీకి మధ్య ముడిపడిన బంధానికి ప్రతీకగా బతుకమ్మ నిలుస్తుంది. ఈ పండుగ పాటల్లో సంస్కృతి, సమాజం, సాంకేతిక, సంతాన సాఫల్యం, వైద్యం, స్త్రీల ఐక్యత, స్త్రీ భావజాల వ్యాప్తి, ప్రకృతిపై స్పందన ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఉదాహరణగా బొడ్డెమ్మ అన్న పదంలో ఎంతో అర్థం దాగి ఉన్నది. బొడ్డి అంటే అవివాహిత కన్య. వారిని అమ్మని చేసే పండుగే బొడ్డెమ్మ. స్త్రీ పునరుత్పత్తి శక్తికి, దేవతారాధనకు ప్రతీక. మహిళల జీవిత సార్థకత గురించి సాంకేతికంగా వివరించే పండుగ. అందుకే బతుకమ్మ పాటల్లో వైద్యం, సేద్యం, స్వేచ్ఛ, సంస్కృతి దాగి ఉన్నది. అన్నింటికీమించి కులాలకు అతీతంగా ప్రజల జీవితం ఇమిడి ఉంది. అందుకే బతుకమ్మ పాటల్లో కష్టం, సుఖం, ఉత్తేజం, ఉత్సాహం, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం మిళితమై ఉంటాయి.
ఒక్కో రోజు ఒక్కో విధంగా..
ఎంగిలిపూల బతుకమ్మ రోజు నువ్వులు, నూకలను నైవేధ్యంగా అర్పిస్తారు. అటుకుల బతుకమ్మలో భాగంగా అమ్మవారికి చప్పిడి పప్పు, బెల్లం, అటుకులను జగన్మాతకు నైవేధ్యంగా పెడుతారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నిర్వహించి అమ్మవారికి ముద్దపప్పు, పాలు బెల్లం వంటకాలను ప్రసాదంగా చేసి నైవేధ్యంగా పెడతారు. నాన బియ్యం బతుకమ్మలో నానబెట్టిన బతుకమ్మలో పాలు, బెల్లం, నానబెట్టిన బియ్యంతో, అట్ల బతుకమ్మలో ఉప్పుడు బియ్యం, అట్లను జనని విశ్వమాతకు నైవేధ్యం పెడతారు. అలిగిన బతుకమ్మను ఏర్పాటు చేసి అమ్మవారు అలిగిందని ఆడపడుచులు భావించి బతుకమ్మలను పేర్చి నైవేధ్యం పెట్టకుండా ఆటలు ఆడతారు. వేపకాయల బతుకమ్మలో సకినాల పిండిని వేపకాయలుగా చేసి, వెన్నెముద్దల బతుకమ్మలో నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో చేసిన ఫలహారం అమ్మవారికి నైవేధ్యంగా సమర్పిస్తారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఐదు రకాల నైవేద్యాలు పెరుగన్నం, కొబ్బెర, నువ్వులు, పులిహోర, నిమ్మకాయలతో చేసిన వంటకాలతో పాటు గోదుమ రొట్టెలు బెల్లం కలిసి మలీదావంటకం చేసి అమ్మవారికి నేవేధ్యం పెడతారు. 8 రోజులు పాటు తమ ఇండ్ల ముందు బతుకమ్మలు పేర్చి ఆట
పాటలతో ఆడపడుచులు ఆలరించనున్నారు. 9వ రోజు ఊరి మధ్యలో బతుకమ్మలతో ఆటపాటలు పాడిపేర్చిన బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నారు.
ఎంగిలి పూల బతుకమ్మతో..
ఎంగిలి పూల బతుకమ్మతో తెలంగాణ అంతటా పండుగ మొదలుకానున్నది. ప్రకృతిలో మమేకమై ఆటపాటలతో, ఆనందోత్సవాలతో నిర్వహించుకోనున్నారు. గుమ్మడి ఆకుపై ఒక్కొక్క పువ్వును పేరుస్తూ.. రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి పైన పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి ఆడి, పాడే పూల సంబురం మొదలుకానున్నది. జననీ జగన్మాత గౌరీదేవికి నవ వైవిధ్యాలతో, నవ నైవేద్యాలను అర్పించనున్నారు. ఆడబిడ్డలు తమ మనోభావాలను పాటల రూపంలో వెల్లడిస్తారు. పల్లె పాట ప్రతి నోట ప్రతిబింబించనున్నది.
తొమ్మిది రోజులు బతుకమ్మ ఉత్సవాలు
ఈ సంవత్సరం అక్టోబర్ 14న అమావాస్య (శనివారం) రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతున్నది. 22న అష్టమి ఆదివారం రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. కాగా అక్టోబర్ 24న దశమి రోజున పండుగను పరుపుకోనున్నారు. తొమ్మిది రోజులు ఏ రోజుకు ఆరోజు ప్రత్యేకంగా పూజించడం ఈ పండుగ ప్రత్యేకత. ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో అమ్మవారిని తంగేడు, తామర, జిల్లేడు, గునుగ, బంతి, చేమంతి, నందివర్ధనంలాంటి వివిధ రకాల పూలతో పేల్చి చుట్టూ రెండు చేతులతో చప్పట్లు కొడుతూ ‘బతుకమ్మ బతుకమ్మ’ అంటూ రకరకాల పాటలు పాడుకుంటూ కొలుస్తారు. పూలను రాగి పళ్లెంలో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పల్లెంలో పేర్చుతారు. ఆపై తంగేడు పూల కట్టలు పేర్చుతారు.
మధ్యమధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. అలాగే తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. ఇది పూర్తయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీ మాతను పెడుతారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లోని దైవస్థానంలో పెట్టి కొవ్వొత్తులు, అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. ప్రతి రోజూ బతుకమ్మలు ఆడిన అనంతరం చెలువులో నిమజ్జనం చేస్తారు. ఆపై పళ్లెంలో తెచ్చిన నీటితో పడతులు ‘వాయినమమ్మా.. వాయినం’.. అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకొంటారు. తర్వాత ఇంటి నుంచి తీసుకువచ్చిన పెరుగు అన్నం, సత్తుపిండి (మొక్కజొన్నలు లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగా వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం, నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు)ని ఇచ్చి పుచ్చుకొని తింటారు. ఇలా ప్రకృతితో మమేకమైన పండుగ బతుకమ్మ. జానపద పాటలతో గౌరీదేవిని కొలిచే పడతుల పండుగ. ఈ పూవులతో చేసిన బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేయడంతో సూక్ష్మక్రిములు చనిపోయి నీరు శుద్ధి అవుతుంది. గునుగు పువ్వులు జీర్ణకోశాన్ని శుద్ధి చేస్తాయి.
పీయూలో బతుకమ్మ సంబురాలు
పాలమూరు విశ్వవిద్యాలయంలోని పీజీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలు ఎన్ఎస్ ఎస్ కో-ఆర్డినేటర్ డా.ప్రవీణ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీయూ ఉపకూలపతి లక్ష్మీకాంత్రాథోడ్, రిజిస్ట్రార్ గిరిజా మంగతాయారు బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహిం చి వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో వోఎస్డీ డాక్టర్ మధుసూదన్రెడ్డి, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, పరీక్షల నియంత్రణ అధికారి రాజ్కు మార్, అర్జున్కుమార్, కిశోర్, వివిధ విభాగాల అధిపతు లు, అధ్యాపకులు పాల్గొన్నారు.