మహబూబ్నగర్ మెట్టుగడ్డ/నాగర్కర్నూల్, జూలై 31: కష్టాలను ఎదుర్కొని శ్రమను నమ్ముకొని లక్ష్యాలను ఎంచుకొని కొవ్వొత్తిలా ఎగిసిన కెరటం విశ్రాంత ఎంఈవో బాల జంగయ్య. ప్రతిచోట ప్రతి హోదాలో పనిచేసిన సంపూర్ణ న్యాయం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలకు చేర్చిన ఉపాధ్యాయుడు, విశ్రాంత ఎంఈవో బాలజంగయ్య తన మరణానంతరం శరీరాన్ని వైద్య పరీక్షల నిమిత్తం మహబూబ్నగర్ మెడికల్ కళాశాలకు అప్పగించాలని గతంలోనే ఒప్పందం పత్రంపై సంతకం చేశారు. బల్మూరు మండలకేంద్రానికి చెందిన బాల జంగయ్య విద్యార్థులకు విద్యాబుద్ధులతోపాటు సమాజంలోని వివక్ష, అణిచివేతలు, అసమానతలు రూపుమాపాలని కోరుకున్న మహోన్నతమైన వ్యక్తి అని పలువురు కొనియాడారు. నమ్మిన సిద్ధాంతాల కోసం తుదిశ్వాస దాకా పోరాడి పాలమూరు అధ్యయన వేదిక నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు.
బాల జంగయ్య భౌతిక కాయాన్ని ఆదివారం మహబూబ్నగర్ మెడికల్ కళాశాలకు కుటుంబసభ్యులు, శిష్యులు, ఉపాధ్యాయులు, సహచరుల మధ్య వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ సునందిని, అనాటమీ విభాగపు అసోసియేట్ అసిస్టెంట్ ప్రొ ఫెసర్ డాక్టర్ తనూజకు అప్పగించారు. ఈ సందర్భంగా భౌతికకాయానికి కళాశాల విద్యార్థులు ఘనంగా స్వాగ తం పలికారు. బాల జంగయ్య తండ్రి పడాల బాలయ్య మరణం తర్వాత ఆయన భౌతికకాయాన్ని కూడా మహబూబ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పరిశోధనకోసం అప్పగించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కళాశాల ప్రాంగణానికి చేరుకొని బాల జంగయ్యకు నివాళులర్పించారు. ఉప్పునుంతల మండల విద్యా వ్యవస్థ బలోపేతానికి ఆయన క్రియాశీలక భూమిక పోషించారు. బల్మూరు, ఉప్పునుంతల, వంగూరు, అమ్రాబాద్ మండలాల్లో హెచ్ఎంగా విద్యాబోధన చేశారు. తదుపరి కాలంలో ఉప్పునుంతల ఎంఈవోగా విధులు నిర్వహించి 2020జూలైలో ఉద్యోగ విరమణ చేశారు. ఇదిలా ఉండగా అచ్చంపేటలో అశ్రునయనాల మధ్య బాల జంగయ్య అంతిమయాత్ర కొనసాగింది. కడసారి చూసేందుకు అశేష ప్రజానీకం తరలివచ్చారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్థ్ధీవదేహాన్ని మోసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎంపీ రాములుతోపాటు ప్రజా, ఉద్యమ సంఘాల నేతలు నివాళులర్పించారు.