మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 1 : దుర్మార్గులంతా ఒక్కటై.. పాలమూరు జి ల్లాను భ్రష్టు పట్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీ నివాస్గౌడ్ తెలిపారు. అనవసర మాటలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆశకార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిని ఓర్వలేక కుట్ర రాజకీయాలకు తెరలేతున్నారన్నారు. గతంలో పట్టణ వాసులకు 14 రోజులకోసారి నీళ్లు ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అన్ని పార్టీలు ఏకమై ఎన్నికల ముందు డ్రామాలు చేస్తుంటారని, వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి జిల్లాకు గు ర్తింపు తెచ్చామన్నారు. జిల్లాను మహానగరంగా తీర్చిదిద్ది.. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తరహాలో మున్సిపల్ కార్పొరేషన్ చేసి చూపిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఆశవర్కర్లు ఇందిరా పార్కు వద్ద జీతాల కోసం ధర్నా చేస్తే ఫైర్ ఇంజిన్లతో నీళ్లు పోసి గుర్రాలతో తొక్కించారని గుర్తుచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కార్ ఆశకార్యకర్తల కు టుంబాలకు అండగా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేనంతగా జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ఆశవర్కర్లు ఇదే స్ఫూర్తితో మరింత కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ఆశవర్కర్లకు గృహలక్ష్మి పథకం కింద సొంతిల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షు డు కృష్ణమోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి విఠల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతి వార్డునూ అభివృద్ధి చేస్తాం..
మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డునూ అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. హౌసింగ్బోర్డు కాలనీలో రూ.72.50 లక్షలు, సంతోష్నగర్లో రూ.85.83 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ముసురు వర్షంలో సైతం వార్డుల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలను రూ.140 కోట్లతో మరమ్మతులు చేపడుతున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి వార్డుల్లో పర్యటిస్తున్నామన్నారు. అనంతరం సగరకాలనీలోని కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్లు యాదమ్మ, వనజ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.