వనపర్తి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం.. ఉపసంహరణల గడువు ముగియడంతో ఇక ప్రచారాల వేడి రగులుతున్నది. వనపర్తి అసెంబ్లీ బరిలో మొత్తం 13మంది నిలిచారు. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ప్రధాన పార్టీల వారు మినహా ఇతరులంతా నామమాత్రంగానే ప్రచారాలను చేపటడుతున్నారు. ఉన్న సమయంలోనే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కేడర్ను ఎక్కడికక్కడ సమాయత్తం చేసుకుంటూ ప్రచారాలను చిన్నా, పెద్ద తేడాలేకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ముందస్తు అనుమతితో ప్రచార రథాలను ఏర్పాటు చేసుకొని ముమ్మరంగా గ్రామాల్లో ఓట్లను అభ్యర్థించే పనులకు శ్రీకారం చుట్టారు. ఉపసంహరణల ప్రక్రియ ముగింపుతో పల్లెల్లో ప్రచారాల సందడి పెరిగింది.
ఈనెల 28 వరకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలను అభ్యర్థులు ముగించాలి. మైకుల హోరు, ప్రచార రథాల హడావుడి అంతా గప్చుప్ అన్నట్లుగా ముగియనున్నది. అ సెంబ్లీ ఎన్నికల పోటీలో నిలిచిన అభ్యర్తులందరికీ గుర్తుల కేటాయింపులతోపాటు బ్యాలెట్ నమూనాలను కార్యాలయాల వద్ద ప్రదర్శించనున్నారు. ఈనెల 28న సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగించాల్సి ఉంటుంది. 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్లను లెక్కించనున్నారు.
బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే నియోజకవర్గ ఓటర్లకు దిశానిర్దేశం చేశారు. మంత్రి సింగిరెడ్డి సైతం ఉన్న సమయాన్ని ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వనపర్తి వార్డుల్లో ప్రచారాలను సింహభాగం పూర్తి చేసిన మంత్రి మండలాలు, గ్రామాల్లో విరివిగా ప్రచారం చేపడుతున్నారు. షెడ్యూల్ కంటే ముందే బీఆర్ఎస్ టికెట్లను ఖరారు చేసిన క్రమంలో పల్లె, పట్టణం తేడాలేకుండా ప్రజలను కలవడంలో నిమగ్నమయ్యారు. ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోకుండా ప్రాధాన్యతగా తీసుకుంటూ మంత్రి సింగిరెడ్డి ప్రచారాలను చేపడుతున్నారు. రెండు రోజుల నుంచి నియోజకవర్గంలోని గోపాల్పేట, రేవల్లి, పెద్దమందడి మండలాల్లో ప్రచారాలు చేపట్టగా, గురువారం ఖిల్లాఘణపురం మండలంలోని 16 గ్రామాల్లో ప్రచారాన్ని మంత్రి సింగిరెడ్డి నిర్వహించారు.
బీజేపీ అభ్యర్థిగా అనుజ్ఞారెడ్డి బరిలో నిలవగా, ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి అంతంత మాత్రంగానే ఓటర్ల బలం ఉంది. అనుజ్ఞారెడ్డి అభ్యర్థిత్వంపైనా బీజేపీలోని కొంతమంది సీనియర్లు ఇష్టపడటం లేదు. ముందుగా అశ్వత్థామా రెడ్డిని వనపర్తి అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ అదిష్టానం చివరిదశలో ఆయన తప్పుకోవడం, అనుజ్ఞారెడ్డికి అవకాశం ఇచ్చారు. పార్టీ ప్రచారాలపై ఇష్టంలేని నాయకులంతా అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇక మిగిలిన అభ్యర్థులు బీఎస్పీ నుంచి మండ్ల మైబూస్, ప్రజా ఏక్తా పార్టీ నుంచి సూర్యప్రకాశ్, ఆలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ పార్టీ నుంచి అర్జున్, ధర్మ సమాజ్ పార్టీ నుంచి బంకల ఎల్లయ్య పోటీలో ఉండగా, మరో ఆరుగురు స్వతంత్రులుగా ఎన్నికల బరిలో నిలిచారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్ది పార్టీల ప్రచారాల్లో వేగం పెరుగుతుంది. దసరా నుంచి వరి పంట చేతికి రావడంతో రైతులకు సేద్యం పనుల బిజీ మొదలైంది. దీంతోపాటు పది రోజుల నుంచి చలి తీవ్రత ఇంతకింతకూ ఎక్కవవుతున్నది. గ్రామాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో జనం ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారు. ఉదయం వేళలో ప్రచారాలకు చలి కూడా ఆటంకపరుస్తున్నది. ఎక్కువ మంది ఎక్కడ ఉంటే.. అక్కడే ప్రచారం అన్నట్లుగా అభ్యర్థులు వారి దగ్గరకే వెళ్తున్నారు. ఏపనిలోనైనా 20 మంది ఉన్నారంటే.. అక్కడికే అభ్యర్థులు వెళ్లి కలిసే ప్రయత్నం చేస్తూ ఓటర్లను అభ్యర్తిస్తున్నారు. ఉన్న తక్కువ సమయంలో అన్ని గ్రామాలను తిరిగేందుకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రణాళిక వేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా మేఘారెడ్డి ఫైనల్ అయినప్పటికీ ఆ పార్టీలో కార్యకర్తలు, నాయకులకు ఇంకా కలవరం వీడడం లేదు. ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు వెళతారోనన్న గందరగోళం నెలకొన్నది. చిన్నారెడ్డికి టికెట్ దక్కనందునా ఆయన వర్గమంతా చిన్నబుచ్చుకున్నట్లుగానే ఉంది. వీరిలో ప్రధాన నేతలు ఇప్పటికే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా, మరికొందరు ముఖ్యులు కూడా అదేబాటలో ఉన్నట్లు తెలుస్తుంది. చిన్నారెడ్డితో డబ్బులు లేవని ప్రచారం చేసిన మేఘారెడ్డి వర్గం కూడా ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా స్వయంగా కార్యకర్తలు, నాయకులే చెబుతున్నారు. మేఘారెడ్డికి ప్రధాన అనుచరులు అనుకుంటున్న వారే తెరమరుగు అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మేఘారెడ్డి తన కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్నారు.