రైతు పండుగకు వేళైంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రైతు దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. కందనూలు జిల్లాలో సేద్యం సంబురంగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సాగునీటి వనరులు పెరగడంతో బీడుబడిన భూములు మాగాణుల్లా మారాయి. ఎంజీకేఎల్ఐ లిఫ్ట్తో పాటు రైతుబంధు, రైతుబీమాలాంటి సంక్షేమ పథకాల అమలుతో రైతులకు సాగుపై ఆసక్తి పెరిగింది. దీంతో ఏటా జిల్లాలో వ్యవసాయంలో ప్రగతి దిశగా సాగుతున్నది.
– నాగర్కర్నూల్, జూన్ 2 (నమస్తే తెలంగాణ)
నాగర్కర్నూల్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. తెలంగాణ ఏర్పాటుతో పెండింగ్లో ఉన్న ఎంజీకేఎల్ఐని ప్రారంభించడంతో సాగునీటి కొరత తీరింది. ఇప్పటి వరకు దాదాపుగా 240టీఎంసీల నీటిని ఎత్తిపోయడంతో ముళ్ల కంపతారు చెట్లతో ఉన్న భూములు పంటలు పండించే బంగారంగా మారాయి. అలాగే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్, వట్టెం వద్ద రిజర్వాయర్ల నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. జూలైనాటికి రెండు మో టర్లు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇటీవలే రూ.80కోట్లతో బిజినేపల్లి మండలంలో మార్కండేయ, అచ్చంపేట లిఫ్టు రూ.1534కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఇలా సాగునీటి సమస్య తీరడంతో పాటుగా 1,06,822 వ్యవసాయ బావులకు నిరంతర ఉచిత విద్యుత్ కోసం రూ.747కోట్లను ఖర్చు చేశారు. అలాగే మిషన్ కాకతీయతో 2వేల వరకు చెరువుల పునరుద్ధరణ జరిగింది. దీనివల్ల వ్యవసాయ పొలాలకు ఎండాకాలంలోనూ సాగునీరు లభిస్తోంది. ఫలితంగా 2014-15లో 5.73లక్షల ఎకరకాలున్న సాగు విస్తీర్ణం ప్రస్తుతం 8.89లక్షల ఎకరాలకు చేరడం గమనార్హం. పత్తి, వేరుశనగ, వరి పంటలు రికార్డు స్థాయిలో పండుతున్నాయి. పండించిన పంటను కొనేందుకు వానకాలం, యాసంగిలో ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అందిస్తోంది. ఇక రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చే దేశంలో లేని బృహత్తర పథకం రైతుబంధు ద్వారా జిల్లాలో 2.88లక్షలమంది రైతులకు ఇప్పటివరకు రూ.3,236కోట్లను గత సీజన్లో అందించింది. అలాగే రైతుబీమా పథకం ద్వారా 4,323మంది రైతులకు రూ.216కోట్ల పరిహారం అందింది. జిల్లాలోని రైతుల కోసం ఏఈవోల పరిధిలో 143వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో రైతువేదికల నిర్మాణం చేపట్టారు. దీనివల్ల రైతులకు సీజన్లలో విత్తనాలు వేయడం నుంచి కొనుగోళ్ల వరకు అవసరమైన సహాయాన్ని వ్యవసాయ అధికారులు అందజేస్తారు.
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఇప్పటి వరకు 3,311మంది రైతులకు రూ.28కోట్ల పనిముట్లు రాయితీపై అందాయి. వ్యవసాయ రంగంలో సాంకేతిక విద్యాభివృద్ధి కోసం బిజినేపల్లి మండలం పాలెంలో రూ.29కోట్లతో అగ్రికల్చర్ బీఎస్సీ కళాశాల 2015లో ప్రారంభమైంది. ఇంతకుముందు ధాన్యం నిల్వల కోసం జిల్లాలో 12గోదాంలు 10,600మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మాత్రమే ఉండగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాబార్డు సౌజన్యంతో రూ.63కోట్లతో 1,07,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంగల 26గోదాంల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో 38గోదాంలున్నాయి. ఆయిల్ పాం ప్రోత్సాహం కోసం జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా, 2020-21లో 58 మంది రైతులు 221ఎకరాల్లో, 2022-23లో 760మంది రైతులు 3,075ఎకరాల్లో ఆయిల్పాం తోటలను సాగు చేశారు. ఈ తోటలకు ఎకరాకు రూ.4,200చొప్పున రూ.12కోట్లను సబ్సిడీగా ప్రభుత్వం అందించింది. మైక్రో ఇరిగేషన్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీ, చిన్న, సన్నకారు రైతులకు 90శాతం సబ్సిడీపై, ఇతర రైతులకు 80శాతం సబ్సిడీపై సాయం అందుతోంది. వ్యవసాయ రంగంలో జిల్లా రోజురోజుకూ ముందుకు సాగుతోంది. దీనివల్ల వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు నాలుగింతలయ్యాయి. ఇక తెలంగాణ పదో వార్షికోత్సవం సందర్భంగా రైతువేదికల వద్ద ప్రత్యేకంగా రైతు దినోత్సవాలను నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. ఇప్పటికే అధికారులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లను ప్రారంభించారు. రైతువేదికను మామిడి తోరణాలతో ముస్తాబు చేసి ఎడ్లబండ్లతో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం చేసిన, చేపట్టబోయే అభివృద్ధి గురించి వివరించనున్నారు.