మహబూబ్నగర్టౌన్, నవంబర్ 17: అప్పన్నపల్లి రెండో బ్రిడ్జి నిర్మాణాన్ని జనవరి చివరి నాటికి పూర్తి చేస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం అప్పన్నపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జి పనులను మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో ఒక బ్రిడ్జి నిర్మాణానికి 12 ఏండ్ల సమయం పట్టిందని..ఇప్పుడు అక్కడే సమాంతరంగా 12 నెలల్లో పూర్తి చేస్తున్నామని తెలిపారు. సమైక్య పాలనలో బ్రిడ్జి లేకపోవడంతో గంటకోసారి రైల్వే గేట్ పడడటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత, అప్పన్నపల్లిలో బ్రిడ్జిని రెండు నెలల్లో పూర్తి చేయించామన్నారు.
రెండో బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కు కేవలం గంట వ్యవధిలో ప్రయాణించే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి బ్రిడ్జి పనులు మొత్తం పూర్తి అవుతాయని రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్మించాల్సిన స్లాబ్ గడ్డర్ల పనులు ఆలస్యం వల్లే సూమరు నెల పాటు సమయం అదనంగా పడుతుందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, జాతీయ రహదారుల విభాగం ఈఈ రమేశ్కుమార్, ఏఈ వినోద్కుమార్ పాల్గొన్నారు.