మరికల్, నవంబర్ 24 : తమిళనాడుకు చెందిన ఓ అనాథ వ్యక్తి కొన్ని రోజులుగా మండలకేంద్రంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో కాలుకు గాయమయ్యింది. గాయమైన కాలులో పురుగులుపడి లేవలేని పరిస్థితిలో ఉన్న అనాథను మండలకేంద్రానికి చెందిన హరీశ్కుమార్ బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గమనించి 108 అంబులెన్స్కు ఫోన్ చేసి అందులో తీసుకెళ్లి మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు తరలించాడు. హరీశ్కుమార్ను గ్రామస్తులు అభినందించారు.
మక్తల్ అర్బన్, నవంబర్ 24 : మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని చేరదీసిన సీఐ సీతయ్య మానవత్వం చాటుకున్నారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో 15 సంవత్సరాల కిందట ఫొటోగ్రాఫర్గా పనిచేస్తూ నర్సింహులు మతి స్థిమితం కోల్పోయి రోడ్డుపై తిరుగుతూ యాచక వృత్తి చేస్తున్న వ్యక్తి గురువారం స్టేషన్కు తీసుకొచ్చి బార్బర్ సహాయంతో గడ్డం, తల వెంట్రుకలను కట్ చేయించారు. అనంతరం స్నానం చేయించి కొత్త బట్టలు వేయించి భోజనం పెట్టించి చలికి దుప్పటి ఇవ్వడం జరిగింది.
మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇకపై మీకు అందరు ఉన్నారని ఎప్పుడైనా స్టేషన్కు వచ్చి సహాయం పొందవచ్చని సీఐ తెలిపారు. రోడ్డుపై మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న వ్యక్తిని సీఐ చేరదీసినందుకు పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై పర్వతాలు, పోలీసులు పాల్గొన్నారు.