మహబూబ్నగర్, జనవరి 7 : ‘కట్టెల పొయ్యి వాడొద్దు.. ఉచితంగా సిలిండర్, పొయ్యి ఇస్తాం’ అని కేంద్రం పేదలకు ఆశ చూపింది. దీంతో ప్రజలు రేషన్, ఆధార్కార్డులు అందజేసి ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నది. బీజేపీ అధికారంలోకి రాకముందు గ్యాస్ ధర రూ.450 ఉండేది. సబ్సిడీని నేరుగా గ్యాస్ కంపెనీలకు అప్పగించారు. తాము చేసే సాయం (సబ్సిడీ) గ్యాస్ కంపెనీలకు అందించడం ద్వారా లబ్ధిదారులకు తెలియడం లేదని.
నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేసేందుకు పూనుకున్నది. అయితే, మోదీ సర్కార్ గ్యాస్ ధరను రూ.1110కి పెంచింది. సబ్సిడీకి క్రమేణా మంగళం పాడింది. దీంతో సామాన్యులు గ్యాస్ సిలిండర్ను కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు. మళ్లీ కట్టెలపొయ్యి వైపు గ్రామీణుల దృష్టి మారుతున్నది. ఇదిలా ఉండగా, మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 1,51,191 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. హెచ్పీ, ఇండియన్, భారత్ కంపెనీలకు సంబంధించి 23 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా అవుతున్నది. ఇంటికి సిలిండర్ తీసుకువచ్చే సిబ్బంది అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సర్వీస్ చార్జి ఇవ్వాల్సిందే అంటూ దర్జాగా తీసుకుంటున్నారు.
గ్యాస్ కంపెనీల యజమానులు సైతం అదనపు వసూలుతో తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సిలిండర్ రూ.1110 ఉండగా, అదనంగా రూ.20 నుంచి రూ.40 వరకు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ప్రజలపై అదనపు భారం పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇకనైనా అధికారులు ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశమై అదనపు వసూళ్లు చేయకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. సిలిండర్ తీసుకొచ్చే సిబ్బంది అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మహబూబ్నగర్ డీఎస్వో బాలరాజు తెలిపారు.