మహబూబ్నగర్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : శాసనమండలి ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉమ్మడి జిల్లాలోని ఆయా జిల్లాల పరిధిలో పది చోట్ల ఓటు వేసేందుకు అధికారులు ఇప్పటికే కేంద్రాలను ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1,439 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఉప ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ జెడ్పీ వైస్చైర్మన్ నవీన్కుమార్రెడ్డి, కాంగ్రెస్ నుంచి జీవన్రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్గౌడ్ బరిలో ఉన్నారు. ఉప ఎన్నిక సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. బుధవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లో పోలింగ్ సామగ్రిని, బ్యాలెట్ బాక్సులను సిబ్బంది భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఉప ఎనికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఎన్నికల పరిశీలకురాలు వాణిప్రసాద్ పరిశీలించారు. మైక్రో అబ్జర్వర్లతో సమావేశమై నిర్వహించాల్సిన విధులను వివరించారు. అంతకుముందు కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవినాయక్ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ను పరిశీలించారు. బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ నిర్వహిస్తుండడంతో పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియను కంట్రోల్ రూంలో నుంచి పర్యవేక్షిస్తారు. ఓటింగ్లో పాల్గొనాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులను రెండు పార్టీల ప్రతినిధులు శిబిరాలకు తరలించారు. వారంతా నేరుగా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియెగించుకునేలా ఏర్పాటు చేస్తున్నాయి. రెండు పార్టీల్లో క్రాస్ ఓటింగ్ భయం నెలకొంది. ఇటీవల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పక విజయం సాధించాలని క్యాడర్ను కోరారు.
శాసన మండలి ఎన్నిక తుది ఘట్టానికి చేరుకున్నది. ఎన్నికల కోసం మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,439 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ మేరకు అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులకు మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు వేయాల్సి ఉంటుంది. 2021లో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎనికయ్యారు. ఆ తర్వాత గెలిచిన కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. మహబూబ్నగర్, నారాయణపేట, కొడంగల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, కొల్లాపూర్, అచ్చంపేట, షాద్నగర్, కల్వకుర్తి, నాగర్కర్నూల్లో ఆయా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. 1,439 మంది ఓటు హక్కు కలిగిన వారిలో 19 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. వారిలో 17 మంది పురుషులు, ఇద్దరు మహిళలు, ఎంపీటీసీల్లో 888 మంది ఉండగా, 386 మంది పురుషులు, 502 మంది మహిళలు, జెడ్పీటీసీల్లో 83 మందిలో 36 మంది పురుషులు, 47 మంది మహిళలు, కౌన్సిలర్లలో 449 మందిలో 205 మంది పురుషులు, 244 మంది మహిళలుఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
శాసన మండలి ఉపఎన్నికల పోలింగ్ కోసం భారీ పోలీసు బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు ఉన్నతాధికారులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయా జిల్లాల ఎస్పీలు ప్రకటించారు. జోగులాంబ జోన్ ఐజీ ఆధ్వర్యంలో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతోపాటు సిబ్బందిని బందోబస్తు మధ్య తరలించారు. పోలింగ్ ప్రక్రియ అంతా నిఘా నీడలోనే సాగేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను ఉమ్మడి జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూంకు తరలిస్తారు. మహబూబ్నగర్ జిలా ్లకేంద్రంలోని బాలుర కళాశాలలో ఏప్రిల్ 2న కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూంతోపాటు ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతున్నది. శాసన మండలి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కన్నా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇరు పార్టీలు స్థానిక ప్రజప్రతినిధులను తమవైపునకు లాక్కునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కాం గ్రెస్కు సంఖ్యాబలం లేనప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సై అం టూ పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపింది. గెలుపుకోసం అధికార పార్టీ కో ట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయిందనే విమర్శలు వస్తున్నాయి. కొందరు కు టుంబ సమేతంగా శిబిరాల్లోనే ఉన్నా రు. నేరుగా వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.