భోపాల్, ఆగస్టు 6: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమం వివాదాస్పదమైంది. కొత్త మొక్కలను నాటేందుకు వీలుగా వందలాది పెద్ద చెట్లను నరికివేశారన్న ఆరోపణలు రావడంతో అటవీ పెంపకం ప్రాజెక్టుల అమలు తీరుపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) సుమారు 10,000 మొక్కలు నాటేందుకు కాంట్రాక్టు ఇచ్చిన కలియాసోట్ ప్రాంతంలో ఈ చెట్ల నరికివేత ఘటన జరిగిందని ఆరోపణలు వచ్చాయి.
ముండ్ల పొదలను తొలగించమని కాంట్రాక్టర్కు సూచించినప్పటికీ ఆరోగ్యకరమైన పచ్చని చెట్లను కూడా నరికివేశారు. పెద్ద చెట్లను నరికివేసి ఆ స్థానంలో మొక్కలు నాటితే అవి పెరుగడానికి ఎంతకాలం పడుతుందని, అంతకంటే పెద్ద చెట్లను సంరక్షించడం వల్ల చాలా ఎక్కువ పర్యావరణ ప్రయోజనాలు కలుగుతాయని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. ఈ వివాదంపై బీఎంసీ అధ్యక్షుడు కిషన్ సూర్యవంశీ స్పందిస్తూ ప్రాథమిక విచారణలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉన్నట్టు తేలిందని, ఆయనకు రూ. 3.5 లక్షల జరిమానా విధించామని తెలిపారు.