అలంపూర్, ఏప్రిల్ 10: అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటాపాట కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది. మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా పరిసర గ్రామాల కార్యకర్తలతోపాటు నడిగడ్డలోని బీఆర్ఎస్ నేతలు అధికసంఖ్యలో తరలొచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు అజయ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీచుపల్లి, ఉపాధ్యక్షుడు నర్సన్గౌడ్, ఎంపీటీసీ జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ సరితాతిరుపతయ్య, రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జోగుళాంబ పాదాల నుంచి సీఎం కేసీఆర్ పాదయాత్ర చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రాంతంపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక దృష్టి ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్డీఎస్ కోసం రూ.13 కోట్లు ఖర్చు చేశామన్నారు.
ఆయకట్టు భూములను సైతం సస్యశ్యామలం చేసేందుకు తుంగభద్ర నదిపై రూ.786 కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల చేపట్టామన్నారు. త్వరలోనే వంద పడకల దవాఖానను పూర్తి చేసుకొని ప్రారంభించుకుందామన్నారు. మాటతప్పని.. మడమ తిప్పని నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆయకట్టు భూముల్లో ఒకప్పుడు ఒక పంట పండించే రైతులు నేడు రెండు పంటలు పండిస్తున్నారని చెప్పారు. 24గంటల విద్యుత్తోపాటు పంట పెట్టుబడికి ఎకరానికి రూ.5వేలు, రైతుబీమా వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారన్నారు. ఇంతవరకు ఎన్నో సాధించుకున్నాం.. ఇక ముందు కూడా మరెన్నో సాధించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇంత అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య తాను వారధిగా ఉంటూ మరిన్ని సేవలు చేస్తానన్నారు. ఇచ్చినమాట ప్రకారం లింగనవాయి గ్రామానికి కొత్త ఎత్తిపోతల మంజూరు చేయిస్తానన్నారు.
కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు : జెడ్పీ చైర్పర్సన్ సరిత
పండ్లు కాసిన చెట్లకే రాళ్ల దెబ్బలు అన్నట్లు.. పని చేసే నాయకులు, ప్రభుత్వంపైనే విమర్శలు వస్తాయని జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య అన్నారు. నిరంతరం రాష్ర్టాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ సార్పై విమర్శలు చేయడం ఆశ్చర్యమేమీ కాదన్నారు. ప్రజాసంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వానికి, పార్టీకే పట్టం కట్టాలని, పనిచేయకపోతే నిలదీసే అధికారం ప్రజలకు ఉంటుందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయన్నారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తున్న కేసీఆర్ను మనమంతా మరోసారి ఆశీర్వదించాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ పక్క రాష్ర్టాలు సైతం నేడు తెలంగాణ పథకాలు, పాలన వైపు చూస్తున్నాయన్నారు.
ఎటువంటి వ్యాపకాలు లేకుండా పొద్దున్నుంచి రాత్రి వరకు నియోజకవర్గంలో తిరుగుతూ సేవలందించే అబ్రహం సార్ మనమధ్య ఉండడం అలంపూర్ ప్రజల అదృష్టమన్నారు. కమలం గుర్తు నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఎన్నో కష్ట నష్టాలకోర్చి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని మత తత్వ పార్టీ చేతుల్లో పెట్టవద్దని గ్రంథాలయసంస్థ జిల్లా చైర్మన్ రామన్గౌడ్ అన్నారు. ప్రతిపక్షాల అడ్రస్సే లేని తెలంగాణలో గెలిచేది మన సర్కారేనన్నారు. పార్టీలో అందరూ ఐకమత్యంగా ఉంటూ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సార్కు పట్టాభిషేకం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేను కార్యకర్తలు గజమాలతో సన్మానించారు. సమ్మేళనంలో ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారాంరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనోరమవెంకటేశ్, సంకాపురం రాముడు, ఆయా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ అభిమానులు హాజరయ్యారు.