అలంపూర్/ఇటిక్యాల, జూలై 18 : కాంగ్రెస్ పాలనలోనే రైతులు ఆగమయ్యారని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం స్పష్టం చేశారు. మళ్లీ ఇప్పుడు మూడు గంటల కరెంటే చాలంటున్నారని, అది ఎంతవరకు కరెక్టో రైతులే నిర్ణయించాలని సూచించారు. ఇటిక్యాల మండలం షాబాద రైతువేదికలో నిర్వహించిన సదస్సుకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్నదన్నారు. గతంలో నాణ్యత లేని ఏడుగంటల కరెంటుతో రైతులు అష్టకష్టాలు పడ్డారన్నారు. రాత్రి పూట ఇచ్చే విద్యుత్ కోసం రైతులు పొలాలకు వెళ్లి పాముకాట్లకు గురైన సందర్భాలూ ఉన్నాయన్నారు. ట్రాన్స్ఫార్మర్లు పేలి, వాటిని మరమ్మతు చేసే నాటికి పంటలు ఎండిన సందర్భాలు అనేకమన్నారు. తెలంగాణ ఆవిర్భావ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యుత్ సమస్యకు చెక్ పెట్టారన్నారు.
దేశంలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. మూడుగంటల విద్యుత్ చాలన్న నాయకుల మాడు పగిలేలా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణల్లో అర్థం లేదన్నారు. తెలంగాణ రాక ముందు విద్యుత్ చార్జీలను వ్యతిరేకించిన మొదటి వ్యక్తి కేసీఆరే అన్నారు. ప్రస్తుతం రైతులకు నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా అందుతుండగా వారంతా సంతోషంగా ఉన్నారన్నారు. మనకు ఎవరు మేలు చేస్తున్నారు? ఎవరు కీడు చేశారు? అనే విషయాన్ని రైతులు గమనించాలన్నారు. అభివృద్ధి చేసిన వారినే అశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, సర్పంచులు గోవర్ధన్రెడ్డి, మధునాయుడు, సుంకన్న, రాముడు, వీరన్న, నాయకులు గిడ్డారెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకటేశ్గౌడ్, గోవర్ధన్, సూరి, సుంకన్న, దానం, రైతులు పాల్గొన్నారు.