మూసాపేట, జూన్ 11 : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పాలమూరు ప్రాజెక్టుల సందర్శనకు వచ్చి అంతా అబద్ధాలు చెప్పి వెళ్లారని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దుయ్యబట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలం, పోల్కంపల్లి గ్రామంలో గురువారం పోల్కంపల్లి, తిమ్మాపూర్ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చి వెళ్లిన సంగతి అందరికీ తెలుసునని, ఆయన ఒక సీఎం హో దాలో ఉండి కూడా ప్రాజెక్టులకు ఎలాంటి భూ సేకరణ చేయలేదని అబద్ధాలు చెప్పి వెళ్లారని చెప్పారు.
అందుకు నిదర్శనం ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆధారాలు, చిత్రాలతో సహా చూయిస్తూ రాసిందని, వారు రాసింది అక్షర సత్యమని కొనియాడారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండున్నరేండ్లు గడుస్తుంది. కానీ ఒక్క ఎకరం భూమి కూడా కొనలేదు. ఎలాంటి పనులు చేయలేదు. కానీ కేసీఆర్ పాలనలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 27వేల ఎకరాల భూ సేకరణ చేసినట్లు రాసిన పేపర్ను పార్టీ శ్రేణులకు చూయిస్తూ చెప్పారు. మీరు కూడా చదవండీ అందరికీ అర్థం అవుతుందని, నిజం ఏదీ అబద్ధం ఏది అనేది ప్రజలు తెలుసుకొని ఉండాలని చెప్పారు. మన దేవరకద్ర నియోజకవర్గంలోనే కర్వెనలో నాటి సీఎం కేసీఆర్ కురుమూర్తి రాయ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన విషయం అందరికీ తెలుసుని చెప్పారు. ఆ ప్రాజెక్టులో బట్టుపల్లితండా ముంపునకు గురైంది. ఆ తండా వాసులంతా సంతోషంగా భూములు, ఇళ్లు ఇచ్చారు. వాళ్లకు నేను ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం వెంటపడి కొట్లాడి ఇప్పించాను.
వచ్చిన డబ్బులను వృథా చేసుకోవద్దు అని చెప్పాను. వారు నష్టపోతూ లక్షల మంది రైతు కుటుంబాలకు తర తరాలుగా మంచి జరిగే విధంగా వారు ప్రభుత్వానికి సహకరిస్తూ భూములు ఇచ్చారు. అందుకు నేను వారికి అండ గా ఉంటూ ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారాన్ని వెంటపడి ఇప్పించాను. అంతే.. నేను నా జేబులో నుంచి ఒక్క సైసా కూడా రైతులకు ఇవ్వలేదు. నా నిజాయితీని నచ్చి ఆ గ్రామ ప్రజలు నాపై ప్రేమతో ఆ కాలనీకి నా పేరు ‘ఆల వెంకటేశ్వర్రెడ్డి కాలనీ’ అని పెట్టుకున్నారు. ఆ చిత్రం కూడా ‘నమస్తే తెలంగాణ’లో వేశారని చూయించారు. కేసీఆర్ చేసిన పనులకు ని జాలు కళ్లముందు కనిపిస్తున్నా ముఖ్యమంత్రి అబద్ధాలు మా ట్లాడడం విడ్డూరమని అన్నారు.
అప్పట్ల్లో ఆ తండావాసులకు నేను ప్రభుత్వం నుంచి వచ్చి డబ్బులు వృథా చేసుకోకుండా భూములు కొనమంటే 90 శాతం మంది భూములు కొన్నారు. ఆ భూములకు ఇప్పుడు ఎకరం రూ.40 లక్షల వర కు ధర ప లుకుతుంది. ఆ తండాకు చెందిన వారంతా ఇప్పుడు కోటీశ్వరులుగా ఉన్నారు. ఆ కుటుంబాలు బాగుపడ్డాయి, నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉద్యమ పోరాట పటిమతో పనిచేశారని చెప్పారు. అందుకు నిదర్శనం మనకు తెలంగాణ వచ్చిన నాడు ఎద్దులకు కూడా తాగడానికి నీళ్లు ఉండే పరిస్థితి లేదు. తినడానికి గడ్డి కూడా దొరకకుండే. ఆ పరిస్థితుల్లో కూడా కేసీఆర్ సార్ ముందు చూపుతో పాటు ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉండ డం వల్లే నేను, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి కోరిన వెంటే రూ. వంద కోట్లు మంజూరు చేశారని, ఆ నిధులతో కాల్వ తవ్వి మీ గ్రామంలో ఉండే వాగుల్లోకి, చెరువుల్లోకి శ్రీశైలం నుంచి కృష్ణా జాలాలను తీసుకొచ్చామని, ప్రతి ఇంటికి తాగునీరు అందించామని చెప్పారు.
నాడు కేసీఆర్ ముందు చూపుతో యూరి యా తీసుకొచ్చి ప్రతి గ్రామంలో నిల్వ ఉంచెటోడని, గ్రామాల్లో అటు ఇటు తిరిగే ఆటో డ్రైవర్లకు సైతం చెప్పి డబ్బు లు పంపిస్తే తీసుకొచ్చి ఇంటికాడ వేసేటోళ్లని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత యాప్ అంటూ, రైతులను అవస్థలు పెడుతున్నారని ఆరోపించారు. అంతకు ముందు గ్రామంలో ఉండే నా యకులు, యువకులు, రైతులతో వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి మధుయాదవ్ అధ్యక్షత వహించగా బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహాయాదవ్, మాజీ జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, సింగిల్విండో చైర్మన్ బండా వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచ్ రెడ్డిరాజు, శివరాములు, నర్సింహులుగౌడ్, నర్సింహులు, శ్రీనివాసులు, లక్ష్మీనర్సింహ, ఆంజనేయులుతోపాటు ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.